'భార్య పిల్లలు లేని వాళ్లకు దేశం గురించి ఏం తెలుసు..'

by Disha Web |
భార్య పిల్లలు లేని వాళ్లకు దేశం గురించి ఏం తెలుసు..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : భార్య పిల్లలు లేని వాళ్లకు దేశం గురించి, దేశ ప్రజల గురించి ఏం తెలుసని.. ప్రధాని నరేంద్ర మోడీపై రూరల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విరుచుకుపడ్డారు. గురువారం డిచ్పల్లి మండల కేంద్రంలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డిచ్ పల్లి, జక్రాన్ పల్లి, దరిపల్లి, సిరికొండ, ఇందల్వాయి, రూరల్, మోపాల్ మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్రం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్, కల్యాణ, లక్ష్మి షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. హిందువులం హిందుత్వం అనే ఏకైక నినాదంతో దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా ఏకమై గ్రామపంచాయతీ నుండి మొదలుకొని మండల పరిషత్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వరి ధాన్యం కొనాలని ఏకగ్రీవ తీర్మానం చేసి న్యూ ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయానికి పోస్ట్ చేయాలని పేర్కొన్నారు. వాటిని చూసి కేంద్రానికి బుద్ధి వచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 8వ తేదీ వరకు జరిగే పార్లమెంటు సమావేశంలో తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పే వరకు ఉద్యమిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఏ పంట పండిన కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసం దేశంలో మత కల్లోలాలు సృష్టించేది బీజేపీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నించాలని అన్నారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని నిజామాబాద్ జిల్లాలో కేవలం 25 శాతం రైతులు వరి పండించే వారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు లక్షా యాభై వేల ఎకరాలు రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అవుతుందని తెలిపారు. రైతుల ద్వారా ప్రస్తుతం రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, లేదంటే ఢిల్లీకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏడు మండలాల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు,సింగిల్విండో చైర్మన్లు, ఐసీడీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed