- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రికార్డు స్థాయికి చేరిన పచ్చడి పండు ధర

దిశ, తుంగతుర్తి: వివిధ రకాల పచ్చళ్లలో ఉపయోగించే దొబ్బ మిరప పండు ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరింది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.170 పైనే ధర పలుకుతోంది. ఇదే పండు గత రెండేళ్ల క్రితం రూ.20 నుండి రూ.30 పలుకగా గతేడాది రూ.40 నుండి రూ.50 మధ్యకు చేరింది. అయితే ప్రస్తుతం దీని ధర కిలోకి పట్టణాల్లో రూ.170 పైనే పలుకుతోంది. వివిధ రకాల పచ్చలతో పాటు ప్రధానంగా చింతకాయ పచ్చడిలో దొబ్బ మిరప పండుని ప్రజానీకం ప్రధానంగా వినియోగిస్తుంది. కాగా ఈ ఏడాది వచ్చి చింతకాయ కూడా గ్రామాలలో విపరీతంగా కాసింది.
అయితే దీనికి తగ్గట్టు దొబ్బ మిరప పండు పంట దిగుబడి మాత్రం గణనీయ స్థాయిలో పడిపోయింది. దొబ్బ మిరప పంట సాగుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ప్రసిద్ధి. ముఖ్యంగా తుంగతుర్తి మండలంలోని మానపురం, ఏనేకుంట తండ, రావులపల్లి తండ, బాపనిభావి తండ, దుబ్బతండతో పాటు మద్దిరాల మండలంలోని కుక్కడం, కుంటపల్లి, తదితర గ్రామాల పరిధిలోని గిరిజన తండాలు పెట్టింది పేరుగా వాసికెక్కాయి. ఇక్కడ పండిన పంట దూర ప్రాంతాలైన వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, తదితర ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా అమ్మకాల కోసం రైతులు ఎడ్ల బండ్లు, ఆటో, తదితర లగేజ్ వాహనాలలో తీసుకెళ్తుంటారు.
గణనీయంగా తగ్గిన పంట దిగుబడి..
దొబ్బ మిరప పంట దిగుబడి ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది. దీనికి మిరప పంటకు వివిధ రకాలుగా సోకిన రోగాలే ప్రధాన కారణం. రైతులు ప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో దొబ్బతో పాటు తేజ, ఇతర రకాల మిరప పంటల సాగుకు శ్రీకారం చుడతారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ ముందు నుండే చేతికి వచ్చే పచ్చి చింతకాయ సందర్భాన్ని పురస్కరించుకొని దొబ్బ మిరప పండు అమ్మకాలు జరుగుతాయి.
అయితే పంటలకు సోకిన వివిధ రకాల రోగాలకు రైతులు క్రిమిసంహారక మందులు కొట్టినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. కానీ చేతికొచ్చిన మిరపకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్రారంభంలో కిలోకి రూ.100 వరకు పలుకగా ప్రస్తుతం అది రూ.170 పైగా చేరింది.