- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్లో పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ (police system) పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా అసమ్మతిని అణిచి వేయడానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-19 కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సోషల్ మీడియా కార్యకర్తలు, పాత్రికేయులు మరియు సామాన్య పౌరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారి ఖాతాలను బ్లాక్ చేయాలని సామాజిక మాధ్యమ వేదికలకు పోలీసులే స్వయంగా నోటీసులు పంపడం నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు.
రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి ద్వంద్వ ప్రమాణాలతో కూడి ఉందని జగన్ ఆరోపించారు. అధికార టీడీపీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విపక్ష నేతలపై విష ప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ (FIR) కూడా నమోదు చేయడం లేదని ఆయన విమర్శించారు. సాక్ష్యాధారాలు చూపినా పట్టించుకోని పోలీసులు, ప్రతిపక్ష మద్దతుదారులపై మాత్రం తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు రాజ్యమేలుతున్నాయని, పోలీసులను రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తి పై జరుగుతున్న దాడి అని జగన్ పేర్కొన్నారు. ఈ అణచివేత ధోరణిని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.






