పరువు కాపాడుకున్న టీఆర్ఎస్​.. అర్బన్ బ్యాంకు చైర్మన్​పై వీగిన అవిశ్వాసం

by Disha Web Desk |
పరువు కాపాడుకున్న టీఆర్ఎస్​.. అర్బన్ బ్యాంకు చైర్మన్​పై వీగిన అవిశ్వాసం
X

దిశ, రాజన్నసిరిసిల్ల: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో అర్బన్ బ్యాంకు అవిశ్వాసం నోటీస్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మంత్రి కేటీఆర్ కు తెలియకుండా తన ఇలాకాలో అర్బన్ బ్యాంకు చైర్మన్​పై సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాసానికి వెళ్లడం రాజకీయ దూమారం లేపవడంతో టీఆర్ఎస్ అధిష్టానం 'ఆపరేషన్ అర్బన్ బ్యాంకు'ను ఫోర్మెన్ కమిటికి అప్పగించింది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేటీఆర్ మేనబావ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటీ నర్సింగరావ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలతో కూడిన కమిటీ అర్బన్ బ్యాంకు పాలకవర్గం సభ్యులతో కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మూడు రోజుల పాటు చర్చలు జరిపింది.

సోమవారం డీసీవో బుద్దనాయకుడు అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణపై విశ్వాస పరీక్షను పెట్టారు. టీఆర్ఎస్ నేతలు డైరెక్టర్లతో జరిపిన చర్చలు.. కుదిర్చిన సయోధ్య ఫలించడంతో డైరెక్టర్లు అవిశ్వాసం కార్యక్రమానికి హాజరుకాలేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన డీసీవో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఫోర్మెన్ కమిటీ ఊపిరి పీల్చుకున్నారు.

అర్బన్ బ్యాంకు వివాదాన్ని చూస్తూ నిర్లక్ష్యం వహించిన జిల్లా టీఆర్ఎస్ నేతలపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే సద్దుమనిగే విషయాన్ని అవిశ్వాసం వరకు తీసుకెళ్లి పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారని టీఆర్ఎస్ క్యాడర్లో చర్చ కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్కు సైతం వ్యక్తిగత రాజకీయ డ్యామేజ్ జిల్లా నేతలే చేశారని పలువురు పేర్కొంటున్నారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అవిశ్వాసం వీగిపోయేందుకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు.. చీటీ నర్సింగరావ్లు అర్ధరాత్రి వరకు చర్చల పేరుతో పడరాని కష్టాలు పడ్డారు. అవిశ్వాసం వీగిపోవడంతో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్కు సమస్యలను వివరించారు. అవిశ్వాసం వీగిపోయాక కనీసం ప్రెస్మీట్ పెట్టకుండా.. టీఆర్ఎస్ నేతలు ఎక్కడి వారు అక్కడ జారుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి చీవాట్లు పెట్టినట్లు సమాచారం.

ఏది ఏమైన సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అవిశ్వాసం వీడిపోవడంతో టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం ఊపిరి పీల్చుకొని.. కేటీఆర్ ఆగ్రహం నుంచి బయటపడ్డట్లు సమాచారం. రాజన్నసిరిసిల్ల టీఆర్ఎస్ జిల్లా నాయకులు సమన్వయ లోపంతో పనిచేయడం, గ్రూపు రాజకీయాలతోనే ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

Next Story

Most Viewed