పెళ్లి బరత్‌లో డీజే.. పాప భయపడుతోందన్న విడవకుండా చంపేశారు..!

by Disha Web |
పెళ్లి బరత్‌లో డీజే.. పాప భయపడుతోందన్న విడవకుండా చంపేశారు..!
X

దిశ, ప్రతినిధి, ఆదిలాబాద్ : పెళ్లి బరత్‌లో డీజే సిస్టమ్ సౌండ్ తగ్గింపు విషయంలో ఏర్పడిన వివాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి దిలావర్పూర్ మండలం కాల్వ తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో జరిగిన రెండు వివాహ వేడుకలకు సంబంధించి రాత్రి వేళలో బరత్‌ జరిగింది. ఇందులో డీజే సిస్టమ్ సౌండ్ హోరెత్తిపోయింది.

బరత్‌ బృందం గ్రామంలోని జగదాంబ ఆలయం వద్ద కొనసాగుతున్న సమయంలో అక్కడి ప్రాంతానికి చెందిన మెగావత్ నవీన్(30) అనే యువకుడు.. భారీ సౌండ్ మూలంగా తమ ఇంట్లోని పాప భయపడుతోందని.. సౌండ్ తగ్గించాలని వేడుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో బరత్‌లో నృత్యాలు చేస్తున్న పలువురు యువకులు.. మెగావత్ నవీన్‌పై ఆగ్రహావేశాలతో దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి కింద పడేసి కాళ్లతో తొక్కుతూ పిడి గుద్దులు గుద్దారు. దీంతో మెగావత్ నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. తీవ్రంగా గాయపడ్డ నవీన్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఈ విషయమై మృతుని కుటుంబీకులు దిలావర్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed