బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk |
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాల్సించి చట్టసభల్లోనేనని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు తలదూర్చే అవకాశం లేనప్పటికీ గతంలో పలు కోర్టులు వెలువరించిన తీర్పుల ప్రకారం జోక్యం చేసుకునే అధికారం ఉందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని వ్యాఖ్యానించింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను మంగళవారం ఉదయం అసెంబ్లీలో కలవాలని పేర్కొని, వారిని కల్పించాల్సిన బాధ్యతను కార్యదర్శికి అప్పగించింది. స్పీకర్ వారిని సభా సమావేశాల్లో పాల్గొనేలా అవకాశం ఇస్తారనే విశ్వాసాన్ని బెంచ్ వ్యక్తం చేసింది.

పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రశ్నించే సభ్యులు ఉండడం అవసరమని, అప్పుడే అది బలపడుతుందని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. సభ్యులను సస్పెండ్ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతున్నట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 7వ తేదీన బడ్జెట్ సమావేశాల తొలి రోజున ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి సూచనతో స్పీకర్ వారిని మొత్తం సమావేశాలు ముగిసేవరకు హాజరుకాకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని పేర్కొన్నది. దీన్ని సవాలు చేస్తూ ఆ ముగ్గురూ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని కోరారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి బుధవారం విచారణ సందర్భంగా వాదిస్తూ, శాసనసభ నియమావళికి విరుద్ధంగా వారిని సస్పెండ్ చేశారని వివరించారు. ఎలాంటి ప్రస్తావన చేయకుండానే సమావేశాలు ప్రారంభమైన పది నిమిషాల్లోనే మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించి వారిని పంపించారని, ఇదంతా ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. వీరిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి సభా సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన బెంచ్, తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని స్పష్టం చేసింది. న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వడానికి తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని, ఆయన సహకరించలేదని, ఉద్దేశపూర్వకంగానే నోటీసులను తీసుకోడానికి నిరాకరిస్తున్నారని కోర్టుకు వివరించారు.

ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్, జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ స్వయంగా అసెంబ్లీకి వెళ్ళి కార్యదర్శికి నోటీసులు అందజేయాలని ఆదేశించింది. ఈ పని సజావుగా జరిగేందుకు, అసెంబ్లీ లోపలికి వెళ్ళి కార్యదర్శిని కలిసేందుకు నగర పోలీసు కమిషనర్ తగిన చొరవ తీసుకోవాలని స్పష్టం చేసి విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేసింది. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మొదలైన విచారణకు రిజిస్ట్రార్ హాజరై అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు అందజేసినట్లుగా బదులిచ్చారు. ఆ విచారణ సందర్భంగా బెంచ్.. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సభను నిర్వహించడం సభాపతిగా స్పీకర్ బాధ్యత అని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే సభలో ప్రశ్నించేవారు సైతం ఉండాలని పేర్కొన్నది.

ముగ్గురు సభ్యుల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటారని, సభ్యులకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేసిన బెంచ్ మంగళవారం ఉదయం స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలకు సూచించింది. పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. బీఏసీ సమావేశం నిర్ణయం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. చివరి రోజున వీరికి సమావేశాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.



Next Story

Most Viewed