పారిస్ ఫ్యాషన్ షో.. దేవతలు దిగి వచ్చిన వేళ!

by Muthe.Rajitha |

పారిస్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో దేవతలు దిగి వచ్చి రాంప్ వాక్ చేసారు.

పారిస్ ఫ్యాషన్ షో.. దేవతలు దిగి వచ్చిన వేళ!
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వం అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సరికొత్త చరిత్రను లిఖించింది. కేరళ ప్రకృతి సౌందర్యం, ఒడిశా ఆలయ సంస్కృతి, తమిళనాడు శిల్పకళా చాతుర్యం, ఉజ్జయిని పవిత్రత, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక సంపదను ప్రతిబింబిస్తూ.. ప్రముఖ భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన సరికొత్త ఫ్యాషన్ ప్రతిష్టాత్మక 'పారిస్ హౌట్ కోట్యూర్ వీక్' (Paris Haute Couture Week) లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ ఫ్యాషన్ రాజధానిలో భారతీయ డిజైనింగ్ నైపుణ్యాన్ని ఈ ప్రదర్శన మరోస్థాయికి తీసుకెళ్లింది. అంతేకాదు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఎక్కడ చూసినా ఇ దేవతా వస్త్రాల గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా "దేవి : ది ఎటర్నల్ మ్యూస్" (Devi: The Eternal Muse) ద్వారా పారిస్ రాంప్ రన్‌వేను పురాణాలు, ప్రాచీన శిల్పకళల అద్భుత సమ్మేళనంగా మార్చారు. గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో భారతీయ సాంప్రదాయ కోట్యూర్ ప్రభావానికి ఎదురు లేదని ఈ షో చాటిచెప్పింది.

రాతి శిల్పాలకు జీవం పోసిన 'టైమ్ ట్రావెల్'

ఈ ప్రత్యేక కలెక్షన్ కోసం రాహుల్ మిశ్రా 2,000 సంవత్సరాల నాటి దక్షిణ భారత దేవాలయాలలోని అద్భుతమైన శిల్పాలను ప్రేరణగా తీసుకున్నారు. శతాబ్దాల నాటి ఆ రాతి చెక్కడాలే దుస్తుల రూపంలో ప్రాణం పోసుకుని రన్‌వేపై నడిచి వస్తే ఎలా ఉంటుందో ఆయన ఊహించారు. ఈ సృజనాత్మక ప్రక్రియను ఒక 'టైమ్ ట్రావెల్' గా అభివర్ణించిన డిజైనర్.. నాటి శిల్పులకు ప్రేరణనిచ్చిన అదే భావాలను, ప్రతీకలను నేడు అత్యంత క్లిష్టమైన చేతి ఎంబ్రాయిడరీ, నిర్మాణ శైలి ద్వారా ధరించగలిగే అద్భుత వస్త్ర కళాఖండాలుగా మార్చారు.

కాగా, 2020లో పారిస్ హౌట్ కోట్యూర్ వీక్ అధికారిక క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ డిజైనర్‌గా రాహుల్ మిశ్రా రికార్డు సృష్టించారు. ఈ జులై నాటికి ఆయన అక్కడ వరుసగా 14వ సారి తన డిజైన్లను ప్రదర్శించడం విశేషం. ఇప్పటివరకు ఆయన ఒక్క సీజన్‌కు కూడా బ్రేక్ తీసుకోకుండా తన విజయయాత్రను కొనసాగిస్తున్నారు.

'స్లో ఫ్యాషన్'తో దైవిక రూపకల్పన

ప్రాచీన భారతీయ శిల్పాలలో కనిపించే స్త్రీ దైవత్వాన్ని (Feminine Divinity) పురస్కరించుకుని ఈ 'దేవి' కలెక్షన్ రూపుదిద్దుకుంది. ఒక శిల్పి రాతిని చెక్కి లోపలి అందాన్ని ఆవిష్కరించినట్లుగానే.. వస్త్రాల రూపంలో దాగి ఉన్న సౌందర్యాన్ని రాహుల్ మిశ్రా చూపెట్టారు. క్లిష్టమైన చేతి ఎంబ్రాయిడరీ, విభిన్న శిల్ప ఆకృతులు (Sculptural Silhouettes), మెటాలిక్ టెక్స్చర్స్, శరీరాకృతికి తగ్గట్టుగా నప్పే డ్రేపరీల చుట్టూ ఈ దుస్తులను డిజైన్ చేశారు. ఈ వస్త్ర శ్రేణిలో తెలుపు, కాంస్యం (Bronze), బంగారం, చార్‌కోల్, నలుపు రంగులను ఉపయోగించారు. ఇవి రాంప్ వే పై రాతి శిల్పాలు కదులుతున్నాయనే భ్రమను కల్పించాయి.

ఈ ప్రదర్శన వెనుక భారతీయ చేతివృత్తి కళాకారులు కొన్ని వేల గంటల పాటు చేసిన అసాధారణమైన శ్రమ, ప్రతిభ దాగి ఉంది. యంత్రాలతో భారీగా ఉత్పత్తి చేసే దుస్తుల కంటే, మానవ నైపుణ్యంతో కూడిన 'స్లో ఫ్యాషన్' (Slow Fashion) విధానమే నిజమైన లగ్జరీ అని నమ్మే మిశ్రా ఫిలాసఫీ.. అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రియులకు భారతీయ హస్తకళపై మరింత గౌరవాన్ని పెంచింది. ఒకప్పుడు కేవలం ఐరోపా (European) ఫ్యాషన్ హౌస్‌ల వెనుక పనిచేసే హస్తకళాకారులుగానే భారతదేశాన్ని చూసేవారని, కానీ నేడు అంతర్జాతీయ వేదికలపై ఒరిజినల్ కోట్యూర్ డిజైన్లకు కేరాఫ్ అడ్రస్‌గా భారత్ గుర్తింపు సాధించడంలో రాహుల్ మిశ్రా కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.

Next Story