వైరిముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

by Muthe.Rajitha |

తమిళ రచయిత వైరిముత్తుకు ప్రఖ్యాత జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

వైరిముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తమిళ కవి, గీత రచయిత వైరముత్తుకు దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఈ ప్రకటన వెలువడిన క్షణం నుండి సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి... విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు 2018లో సంచలనం రేపిన మీటూ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గాయని చిన్మయి శ్రీపాదతో పాటు సుమారు 17 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించగా, ఇప్పుడు అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అత్యున్నత గౌరవం దక్కడం నైతికంగా సరికాదని సామాజిక కార్యకర్తలు, పలువురు రచయితలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. "కళాకారుడి ప్రతిభను, అతని వ్యక్తిత్వాన్ని వేరు చేసి చూడలేము" అన్న వాదనతో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

గాయని చిన్మయి ఆగ్రహం

మరోవైపు ఈ అవార్డు ప్రకటనపై రాజకీయ, సినీ రంగ ప్రముఖుల స్పందన కూడా విమర్శలకు ఆజ్యం పోసింది. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు వైరముత్తును అభినందించడంపై చిన్మయి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితుల గొంతును విస్మరించి, కేవలం అధికారం, పేరున్న వ్యక్తులకు అండగా నిలుస్తున్నారని ఆమె బహిరంగంగా విమర్శించారు. గతంలో 2021లో కూడా వైరముత్తుకు 'ఒఎన్వీ (ONV) సాహిత్య పురస్కారం' ప్రకటించినప్పుడు ఇటువంటి నిరసనలే వ్యక్తమయ్యాయి. దీనితో ఆయన ఆ అవార్డును తీసుకోనని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు జ్ఞానపీఠ్ విషయంలో కూడా అదే తరహా ఒత్తిడి పెరుగుతోంది. నెటిజన్లు గతంలో జరిగిన నకిలీ లేఖల వివాదాలను, ఇతర ఆరోపణలను గుర్తు చేస్తూ హ్యాష్‌ట్యాగ్‌లతో జ్ఞానపీఠ్ అవార్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

అభిమానుల మద్దతు

అయితే, వైరముత్తు మద్దతుదారులు, తమిళ సాహిత్య ప్రేమికులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 1975లో అఖిలన్, 2002లో జయకాంతన్ తర్వాత సుమారు 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఒక తమిళ రచయితకు జ్ఞానపీఠ్ దక్కడం తమిళ భాషాభిమానులకు గర్వకారణమని వారు భావిస్తున్నారు. వైరముత్తు రాసిన వేల సంఖ్యలో పాటలు, కవితలు, ముఖ్యంగా 'కల్లాట్టు పడిప్పమ్' వంటి రచనలు తమిళ సాహితీ సంపదను పెంపొందించాయని, వ్యక్తిగత ఆరోపణల కారణంగా ఒకరి సాహిత్య ప్రతిభను తక్కువ చేయకూడదని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఒక వైపు సాహిత్య గౌరవం, మరోవైపు బాధితులకు న్యాయం, నైతికత అనే అంశాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. అవార్డు కమిటీ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story