సూర్యాపేటలో టెన్షన్ టెన్షన్.. పోలీసులు వర్సెస్ కాంగ్రెస్

by Disha Web Desk |
సూర్యాపేటలో టెన్షన్ టెన్షన్.. పోలీసులు వర్సెస్ కాంగ్రెస్
X

దిశ, సూర్యాపేట : ఢిల్లీలో బీజేపీ, గల్లీలో టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతిగింజ కొనాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రైతు పండించిన చివరి వరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ధరలు, చార్జీలు పెంచుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పై మోయలేని భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వ హయానికి ఇప్పటికీ గ్యాస్, పెట్రోల్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు. 1960 రూపాయల మద్దతు ధర ఉంటే సూర్యాపేటలో 1200 మించి మద్దతు రావడంలేదని మద్దతు ధర రాక ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఆందోళన చేస్తుండటo విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వదిలి, దమ్ముంటే స్థానిక రైతుల సమస్యలను తీర్చండని డిమాండ్ చేశారు. రాష్ట్ర పన్నుల వాటాను తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువ చేయాలని కేసీఆర్‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ , ఆర్టీసీ ధరలను తగ్గించి సామాన్యులను కాపాడలని కోరారు.

అనంతరం రోడ్డుపై బైటాయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాఠీలకు తూటాలకు భయపడమని పోలీసులు, సీఎంకు వ్యతిరేఖంగా నినాదాలతో హోరెత్తించారు. దామోదర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న కాన్వాయ్‌కి కార్యకర్తలు అడ్డంపడి నినాదాలు చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న వారి దీక్షను దౌర్జన్యంగా భగ్నం చేయడమేంటని పోలీసులను కార్యకర్తలు ప్రశ్నించారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను, దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, అధికార ప్రతినిధి రాజేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖమ్రోద్ధీన్, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, కౌన్సిలర్లు కక్కిరేని శ్రీనివాస్, మేడిపల్లి విక్రమ్, బైరు శైలేందర్ గౌడ్, బాలు గౌడ్, వేణు, కాంగ్రెస్ శ్రేణులు సాగర్ రెడ్డి, నరేందర్ నాయుడు, మాణిక్యం, జానయ్య, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed