ఒక్కటైన మాజీలు.. గులాబీలో గుబులు

by Dishanational1 |
ఒక్కటైన మాజీలు.. గులాబీలో గుబులు
X

దిశ, గోదావరిఖని: వారందరూ గతంలో అధికార పార్టీ గెలుపు కోసం పనిచేసినవారే. అయినా ప్రస్తుత అధికార పార్టీకి దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో రామగుండం గులాబీలో గుబులు మొదలైందంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నారనే ప్రచారం జరిగినా.. వారి సమావేశంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అధికార పార్టీలోనే కొనసాగిన కొంతమంది కార్పొరేటర్లు ఐక్యతగా ఏర్పడి ఏకతాటిపైకి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకోవడం రాజకీయపరంగా నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. గతంలో పోటీ చేసి గెలిచిన కొంతమంది మాజీ కార్పొరేటర్లకు టికెట్ ఇస్తానని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మోసం చేశారని.. మరోవైపు కొంతమందితో చేతులు కలిపి గతంలో జరిగిన ఎన్నికలలో సొంత పార్టీ కార్పొరేటర్లను ఓడించారనే వాదనలు సైతం తెరమీదకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో గతంలో జరిగిన అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐక్యతగా ఉండి పోరాడాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన 23 మంది కార్పొరేటర్లు సమావేశం కావడంతో అధికార పార్టీ గులాబీలో గుబులు పుట్టిస్తోంది. దీంతో జరుగుతున్న పరిణామాలు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారడంతో రానున్న ఎన్నికల్లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమావేశమైన 23 మంది కార్పొరేటర్లకు సంబంధించిన వివరాలను కొంతమంది అధికార పార్టీ నాయకులు చేరవేసే పనిలో పడ్డట్లు సమాచారం.


Next Story