హైకోర్టు ఆదేశాలు బేఖాతర్.. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk 12 |
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్.. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పండ్ల మార్కెట్‌ను మూసి వేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యత్నించడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, వ్యాపారులకు మధ్య కొద్ది సేపు వాదోపవాదాలు జరిగాయి. తమకు హైకోర్టు ఆర్డర్ ఉందని వ్యాపారులు, ప్రభుత్వం మూసి వేయాలి ఆదేశించిందని అధికారులు.. ఇలా ఎవరి వాదన వారిదే.

అసలేం జరిగింది..

ట్రాఫిక్ సమస్యను కారణంగా చూపుతూ.. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను శివారు ప్రాంతమైన కోహెడకు తలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో పండ్ల వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల నుంచి ఒక్కసారిగా నిరసన వ్యక్తమైంది. 1986 నుంచి ఇక్కడే వ్యాపార చేసుకుంటున్నామని, కోహెడ లో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా తమను వెల్లగొట్టడం అన్యాయం అంటూ హైకోర్టు ను ఆశ్రయించారు.

160 రోజుల తర్వాత..

హైకోర్టు ఈ నెల 4వ తేదీన వ్యాపారులకు అనుకూలంగా తక్షణమే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తెరిచి, పూర్తి నివేదిక అందజేయాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు 160 రోజుల తర్వాత ఈ నెల 4న పండ్ల మార్కెట్ ను తెరిచారు. పండ్ల మార్కెట్ తెరుచుకోవడంతో వ్యాపారులు సంబురాలు చేసుకున్నారు.

మూడు రోజుల ముచ్చటేనా..?

సరిగ్గా మూడు రోజుల తర్వాత సోమవారం రాత్రి మార్కెట్ ను మూసి వేయాలంటూ అధికారులు చెప్పడంతో కంగుతిన్న వ్యాపారులు ఆందోళనకు దిగారు. హై కోర్టు ఆదేశాలు భేఖాతరు చేస్తూ మార్కెట్‌ను మూసి వేయడం ఏంటని అధికారులను అడ్డుకున్నారు. మా వద్ద హై కోర్టు ఆర్డర్ కాపీ ఉందని, మీ వద్ద ఏమి ఆర్డర్ ఉందో చూపించాలని నిలదీశారు. దీంతో చేసేది లేక మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

భారీగా మోహరించిన పోలీసులు

మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పండ్ల మార్కెట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి లు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సరూర్ నగర్ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వ్యాపారులు, పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. కోర్టు ఆర్డర్ కాపీ చూపాలంటూ వ్యాపారులు పట్టుబట్టారు. కోర్టు ఆర్డర్ ఉంటే ఖాళీ చేసి వెళ్లిపోతామని చెప్పారు. అయినా అవేవి పట్టించుకోని పోలీసులు మూసివేయడానికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఆందోళనకారులను చెదరగొట్టి మార్కెట్ ను మూసి వేశారు.


Next Story

Most Viewed