'ఈ ప్రభుత్వాలు జలగల్లా పేదల రక్తం పీల్చుతున్నాయి: షర్మిల

by Disha Web |
ఈ ప్రభుత్వాలు జలగల్లా పేదల రక్తం పీల్చుతున్నాయి: షర్మిల
X

దిశ, అడ్డగుడూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డి విరుస్తూ.. జలగల్లా రక్తం పీల్చుతున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శుక్రవారం వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మండలంలోని డిరాపాక గ్రామంలో షర్మిలక్కతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలలో ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం గాలికి వదిలి.. కొత్త పథకాలు తెస్తూ గారడివేశాలతో డ్రామాలాడుతున్నారన్నారు. మేము చేస్తున్న ఉద్యమంతో లక్షా తొంభై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. కేవలం తొంబై వేల ఉద్యోగాలు వేస్తున్నామని ప్రకటన చేసి, ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసగించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారన్నారు.


వడ్ల కొనుగోళ్ళలో రాష్ట్రం, కేంద్రం నాటకాలు ఆడుతూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట -ముచ్చట లో భాగంగా షర్మిల గ్రామస్తుల సమస్యలను అడుగగా వృద్ధులు ఇంట్లో పెన్షన్ ఉన్న వ్యక్తి మరణాంతరం వెంటనే తొలగిస్తున్నారని, ఆ కుటుంబంలో అర్హత కలిగిన వారికి పెన్షన్ ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడుతుందని బాధితులు తెలిపారు. ధరణీతో భూ సమస్యలు తలెత్తి ఉన్న భూములు ఊడిపోయాయని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజన్న రాజ్యం తెస్తామన్నారు. ఎంతమంది వృద్ధులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతూర్తి నియోజకవర్గ ఇంచార్జి అభ్యర్థి ఏపూరి సోమన్నతో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story

Most Viewed