ఎయిర్ఇండియా ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకానికి బోర్డు ఆమోదం!

by Disha Web Desk 17 |
ఎయిర్ఇండియా ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకానికి బోర్డు ఆమోదం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాకు కొత్త సీఈఓ కోసం వెతుకుతున్న క్రమంలో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్‌ సంస్థ ఛైర్మన్ బాధ్యతలకు నియమితులయ్యారు. సోమవారం జరిగిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అలాగే, జనరల్ ఇన్సూరెన్స్ మాజీ సీఎండీ అలిస్ గీవర్గీస్ వైద్యన్ కూడా స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డులో చేరనున్నారు. వీరిద్దరి నియామకానికి అవసరమైన అనుమతులను కూడా బోర్డు ఇచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ తన ఐదేళ్ల పదవీకాలానికి పొడిగింపును పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయంగా, అంతర్జాతీయ ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌లను విస్తరించేందుకు ఎయిర్ఇండియా ఛైర్మన్‌గా కూడా బాధ్యతలను చేపడుతూ, సంస్థలోని విమానాలను అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి సారిస్తారని అధికారులు వివరించారు. కాగా, ఇటీవల ఎయిర్ఇండియాకు కొత్త సీఈఓగా మాజీ టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈఓ ఇల్కర్ ఐచీని నియమించడానికి సంస్థ ఏర్పాట్లు చేయగా, వివిధ కారణాల రీత్యా ఆయన బాధ్యతలను చేపట్టక మునుపే సీఈఓ పోస్ట్ వద్దని ప్రకటించారు. ఎయిర్ ఇండియా సీఈఓ కోసం వెతుకుతున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed