తమిళనాడు రాజకీయ సంక్షోభం.. గవర్నర్ నిర్ణయం సరైనదే: తమిళిసై సౌందరరాజన్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-09 09:20:51  IST  )

తమిళనాడు రాజకీయ పరిణామాలపై తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని, గవర్నర్ తన రాజ్యాంగ విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

తమిళనాడు రాజకీయ సంక్షోభం.. గవర్నర్ నిర్ణయం సరైనదే: తమిళిసై సౌందరరాజన్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ (Hung) రావడంతో రాజకీయ సంక్షోభం (Political crisis) ఏర్పడిన విషయం తెలిసిందే. 108 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే (TVK).. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ (Vijay).. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మెజార్టీని చూపించుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో చిన్న పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నిస్తుండగా, లెఫ్ట్, కాంగ్రెస్ వంటి పార్టీలు గవర్నర్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ (Governor) బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Former Governor Tamilisai Soundararajan) స్పందించారు. నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్ మూడుసార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతోనే గవర్నర్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సంఖ్యాబలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరడంలో ఎలాంటి తప్పు లేదని, అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియేనని ఆమె సమర్థించారు.

ఇదే క్రమంలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీల తీరుపై తమిళిసై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజకీయ స్వలాభం కోసం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు అనవసరంగా బీజేపీ పై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థను వివాదాల్లోకి నెట్టడం మానుకోవాలని, వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని ఆమె ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.

Next Story