'ఉమెన్‌ప్రెన్యూర్' కార్యక్రమం నిర్వహించిన టీ-హబ్!

by Disha Web Desk 17 |
ఉమెన్‌ప్రెన్యూర్ కార్యక్రమం నిర్వహించిన టీ-హబ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టీ-హబ్ ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాబోయే కొత్త తరం కోసం 'ది ఉమెన్‌ప్రెన్యూర్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కొత్త జనరేషన్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు, ఉమెన్ లీడర్లు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్రత్యేక చర్చను నిర్వహించారు. 250కి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా వక్తలు తమ వ్యాపారాల్లో ఎదుర్కొన్న సవాళ్లను, కనుగొన్న పరిష్కారాలను వివరించారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ తమ రంగాల్లో రాణించిన తీరును, వారి వృద్ధిలో ఎదుర్కొన్న జెండర్ పక్షపాతాన్ని ఎలా అధిగమించారు లాంటి అనేక అంశాలను ఈ కార్యక్రమంలో సంభాషించేలా పలు సెషన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ డా గ్లోరీ స్వరూప, మ్యాప్‌మైజీనోమ్ సీఈఓ అను ఆచార్య, లా ట్రోబ్ యూనివర్శిటీ డైరెక్టర్ సెరాసెలా తనసెస్, డా. శాంత వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన టీ-హబ్ సీఈఓ ఎంఎస్ఆర్.. దేశంలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలో మహిళలు నిర్వహించే సంస్థలు ఉన్నాయని, మహిళల ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉందని, దీన్ని అధిగమిస్తూ రానున్న రోజుల్లో దేశీయంగా 4 కోట్ల మహిళా పారిశ్రామిక వేత్తలు వస్తారనే నమ్మకం ఉంది. ఆయా సంస్థల ద్వారా దాదాపు 15-17 కోట్ల ఉద్యోగాలను కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. దీనికి వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అందించేందుకు సాయం అవసరమని' వివరించారు. 'మహిళా పారిశ్రామికవేత్తలు లక్షల్లో ఉద్యోగాలను సృష్టించగలరు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదపడతారు. ఎంఎస్ఎంఈలో మహిళల భాగస్వామ్యానికి కృషి చేస్తున్నామని, మహిళలకు ఉన్న ఇబ్బందులపై ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను అందించినట్టు' గ్లోరీ స్వరూప్ వెల్లడించారు. ఈ సందర్భంగా టీ-హబ్ నిర్వహాకులు 50 మంది మహిళలను సత్కరించారు. వీరిలో స్మార్ట్‌విన్నర్ సీఈఓ అనిందితా బానిక్, మోనిత్ర సహ-వ్యవస్థాపకురాలు అపర్ణ భోగు, ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ నిరజిత్ మిత్ర ఇంకా పలువురు ఉన్నారు.



Next Story

Most Viewed