నటి ట్విష మృతి కేసు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్ట్

by Muthe.Rajitha |

మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.

నటి ట్విష మృతి కేసు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. "ఇన్‌ రే : అలెజ్డ్‌ ఇన్‌స్టిట్యూషనల్ బయాస్ అండ్ ప్రొసీజరల్ డిస్క్రిపన్సీస్ ఇన్ ది అన్‌నాచురల్ డెత్ ఆఫ్ యంగ్ ఉమెన్ ఎట్ మాట్రిమోనియల్ హోమ్" పేరుతో ఈ కేసును సుప్రీంకోర్టు శనివారం నమోదు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపే అవకాశం ఉంది. నోయిడాకు చెందిన ట్విషా శర్మకు భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన ఐదు నెలలకే, మే 12న భోపాల్‌లోని తన అత్తవారింట్లో ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది. ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్‌తో పాటు ఆమె అత్త, రిటైర్డ్ జిల్లా జడ్జి అయిన గిరిబాల సింగ్‌లపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కాగా, నిందితుడు సమర్థ్ సింగ్ శనివారం కోర్టులో లొంగిపోవడంతో అతడికి 7 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. కేసు దర్యాప్తులో పక్షపాతం, సాక్ష్యాల అవకతవకలు, లోపాలు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ సుమోటో చర్య తీసుకుంది. మృతి చెందడానికి ముందు ట్విషా శర్మ తన తల్లికి, స్నేహితురాలికి పంపిన వాట్సాప్ సందేశాలు, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లలో తాను తీవ్ర మానసిక క్షోభ, వరకట్న వేధింపులు అనుభవిస్తున్నానని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును నేరుగా పర్యవేక్షించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story