నాసాకు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్: 27 ఏళ్ల అద్భుత ప్రయాణానికి ముగింపు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-21 05:28:24  IST  )

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటించారు.

నాసాకు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్: 27 ఏళ్ల అద్భుత ప్రయాణానికి ముగింపు
X

దిశ, వెబ్ డెస్క్: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ నాసాకు రిటైర్మెంట్ (Retirement) తీసుకున్నారు. సునీతా రిటైర్మెంట్ గత ఏడాది డిసెంబర్ 27, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని నాసా అధికారికంగా ప్రకటించింది. భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికైంది. తన కెరీర్‌లో మూడు అంతరిక్ష యాత్రల ద్వారా మొత్తం 608 రోజులు కక్ష్యలో గడిపి, అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న నాసా వ్యోమగాములలో రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఆమె చివరి మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ సాంకేతిక సమస్యల వల్ల ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండి మార్చి 2025లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.

సునీతా విలియమ్స్ తన కెరీర్‌లో అనేక అద్భుతమైన రికార్డులను నెలకొల్పారు. అలాగే ఆమె మొత్తం తొమ్మిది సార్లు స్పేస్ వాక్ (Spacewalk) చేసిన మహిళా వ్యోమగామిగా అత్యధిక సమయం (62 గంటల 6 నిమిషాలు) అంతరిక్షంలో నడిచిన ఘనత సాధించారు. అంతరిక్షంలో మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ ఆమెను ఒక గొప్ప మార్గదర్శకురాలిగా అభివర్ణిస్తూ, అంతరిక్ష అన్వేషణలో ఆమె చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. నాసాలో చేరకముందు యూఎస్ నేవీలో కెప్టెన్‌గా పనిచేసిన ఆమెకు 3,000 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం కూడా ఉంది.

Read More..

అంతరిక్ష రంగంలో కొత్త శకం.. ఢిల్లీలో నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక వ్యాఖ్యలు

Next Story