స్కూల్లో మోగిన మృత్యు ఘంటికలు

by Muthe.Rajitha |

తుర్కియేలోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో టీచర్‌తో సహా మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్కూల్లో మోగిన మృత్యు ఘంటికలు
X

దిశ, వెబ్ డెస్క్ : తుర్కియే దేశాన్ని వరుస కాల్పుల ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా కహ్రామన్‌మరాస్ ప్రావిన్సులోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో టీచర్‌తో సహా మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 13 మంది విద్యార్థులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా ధృవీకరించారు.

అంతుచిక్కని కారణం

ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థి, పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారి కుమారుడని అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఐదు తుపాకులు, ఏడు మ్యాగజైన్‌లతో పాఠశాలకు వచ్చిన ఆ బాలుడు, రెండు తరగతి గదుల్లోకి ప్రవేశించి అమానుషంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు, అయితే అతను స్వయంగా కాల్చుకున్నాడా లేదా భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మరణించాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ దారుణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

వరుస ఘటనలతో ఉలిక్కిపడ్డ తుర్కియే

గత 48 గంటల వ్యవధిలో తుర్కియేలో ఇలాంటి దారుణం జరగడం ఇది రెండోసారి కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. మంగళవారం శాన్లియుర్ఫా ప్రావిన్సులోని ఒక ఉన్నత పాఠశాలలో మరో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 16 మంది విద్యార్థులు గాయపడిన ఘటన మరవకముందే, బుధవారం కహ్రామన్‌మరాస్‌లో ఈ ఊచకోత చోటుచేసుకోవడం విద్యాసంస్థల్లో భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వరుస ఘటనలతో తుర్కియే ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Next Story