నిరుద్యోగులకు బంఫర్ ఆఫర్.. ఉచిత శిక్షణతో పాటు, స్టైఫండ్: మంత్రి గంగుల

by Disha Web Desk 19 |
నిరుద్యోగులకు బంఫర్ ఆఫర్.. ఉచిత శిక్షణతో పాటు, స్టైఫండ్: మంత్రి గంగుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశంతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వివిధ రకాల ఉద్యోగాలకు పోస్టుల వారీగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.

బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీసర్కిళ్లతో పాటు మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా కోచింగ్ అందజేస్తామన్నారు. అదే విధంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, ఫ్యాకల్టీతో కూడిన డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు, వీటి ద్వారా కోచింగ్‌తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ని అభ్యర్థులకు అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మోడ్‌లో ఆన్లైన్, ఆఫ్ లైన్ మోడ్లో శిక్షణ ఇస్తామని, అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50,000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు, ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రతిష్టాత్మక ఆన్ అకాడమీతో కొలాబరేషన్ కుదుర్చుకున్నట్టు మంత్రి వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్‌లో రిజర్వేషన్లు బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయిస్తామన్నారు. ఆన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. 21వ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

కుటుంబ వార్షికాదాయం 5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు. గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. దాదాపు పది వేల మంది అభ్యర్థులకు అందించే ఈ శిక్షణలో అర్హులైన వారికి నెలకు ఐదు వేల చొప్పున (ఇందులోనే మెటీరియల్ ఉంటుంది) ఆరు నెలలపాటు స్టైఫండ్ సైతం అందిస్తామన్నారు. గ్రూప్ 2, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు కోచింగ్ ఉంటుందని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రెండు వేల చొప్పున (ఇందులోనే మెటీరియల్ ఉంటుంది) మూడు నెలలపాటు స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/, https://mjpabcwreis.cgg.gov.in, https://unacademy.com/scholarship/tsgovt-scholarship-test లలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

Next Story