చుక్కలు చూపిస్తున్న స్టాఫ్.. నిమ్స్ ఆస్పత్రిలో రోగుల నరకయాతన?

by Disha Web Desk 2 |
చుక్కలు చూపిస్తున్న స్టాఫ్.. నిమ్స్ ఆస్పత్రిలో రోగుల నరకయాతన?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్​ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే రోగులు నరకయాతన పడాల్సి వస్తోన్నది. వీకెండ్​డేస్‌లో అడ్మిషన్లు పొందినోళ్లకు నిమ్స్ స్టాఫ్ చుక్కలు చూపిస్తున్నారు. సకాలంలో ట్రీట్మెంట్​చేయకుండా సతాయిస్తున్నారు. గంటల తరబడి వేచిచూసినా పేషెంట్‌ను పరీక్షించేందుకు డాక్టర్లు రావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే డిశ్చార్జ్​చేసేస్తామంటూ డ్యూటీలోని వైద్యసిబ్బంది బెదిరిస్తున్నట్లు పేషెంట్లు వాపోతున్నారు. చాలామంది పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఎమర్జెన్సీకి వచ్చే రోగుల పరిస్థితి కూడా ఇలానే ఉన్నది. కొందరికి గోల్డెన్​అవర్​కూడా మిస్​అయి సీరియస్​స్టేజ్‌లోకి వెళ్లిపోతున్నట్లు సమాచారం. జిల్లాల నుంచి రోగుల పరిస్థితి అయితే వర్ణణాతీతం. అత్యవసర చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినా, ఆలస్యంగా వైద్యం అందిస్తున్నట్లు పలువురు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారు చేసేదేమీ లేక ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్‌కు వెళ్లిపోతున్నారు. పేదలు మాత్రం వైద్య కోసం కొట్టమిట్టాడుతున్నారు. నిమ్స్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా వారంతా కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ పేషెంట్ చెప్పుకొచ్చారు. డైరెక్టర్, సూపరింటెండెంట్, డ్యూటీ ఆర్ఎమ్ఓ పేషీలోని స్టాఫ్ పేషెంట్ల సంబంధికులెవ్వరినీ అధికారులకు కలవనీయకపోవడం విచిత్రకరం.

పెద్ద డాక్టర్లు లేరు..?

శని, ఆదివారాల్లో అత్యవసర చికిత్స కోసం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిషన్లు వేగంగా ఇవ్వడం లేదు. పేషెంట్లు కండీషన్‌ను బయట ఉన్న సెక్యూరిటీ పరిశీలించి అడ్మిషన్లు ఇవ్వాలని డాక్టర్లకు చెప్పడం దారుణం. పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉండి, సృహతో ఉంటే సదరు కేసును ఎమర్జెన్సీ కాదని స్వయంగా ఎమర్జెన్సీ బ్లాక్ ముందున్న సెక్యూరిటీ స్టాఫ్ చెబుతున్నారు. కాళ్లా వేళ్ల పడినా అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్లు కూడా బయటకు వచ్చి చూడడం లేదు. దీంతో చేసేదేమీ లేక చాలామంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గత్యంతరం లేక ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్నది. పైగా వీకెండ్ డేస్‌లో పెద్ద డాక్టర్లులెవ్వరూ లేరని ఎమర్జెన్సీ వార్డు ముందున్న సెక్యూరిటీ పేషెంట్లను తిప్పి వెనక్కి పంపిస్తున్నారు.

''ఒక్క సెలెన్ బాటిల్ ఇచ్చి వెళ్లిపోయారు: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పేషెంట్​ బంధువు''

మా బ్రదర్ తలకి తీవ్ర గాయమైంది. ఎమర్జెన్సీకి వచ్చిన గంట తర్వాత అడ్మిషన్​ఇచ్చారు. వివరాలు ఎంట్రీ చేసుకొని ఒక సెలెన్​ బాటిల్ ఎక్కించారు. శనివారం అర్థరాత్రి వస్తే ఆదివారం ఉదయం వరకు కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందివ్వలేదు. డాక్టర్లు అడిగినా పట్టించుకోవడం లేదు. పదే పదే అడుతుంటే వాళ్లు సీరియస్ అవుతున్నారు. మంచి వైద్యం అందుతుందని సుమారు 250 కి.మీ దూరం నుంచి వచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవ తీసుకొని పరిస్థితిన చక్కపెట్టాలి. నిమ్స్‌లోని సెక్యూరిటీ స్టాఫ్ అత్యుత్సాహం మరింత దారుణంగా ఉన్నది. పేషెంట్లను అవమానపరిచేలా మాట్లాడుతున్నారు.



Next Story

Most Viewed