మావోయిస్టులు మహిళలపై అత్యాచారాలకి పాల్పడుతున్నారు: ఎస్పీ సునీల్ దత్

by Disha Web Desk 13 |
మావోయిస్టులు మహిళలపై అత్యాచారాలకి పాల్పడుతున్నారు: ఎస్పీ సునీల్ దత్
X

దిశ, కొత్తగూడెం: మహిళల హక్కుల కోసం పోరాడుతున్నామని నీతులు చెప్పే మావోయిస్ట్ పార్టీ నాయకులు మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఇటీవల బుట్టలంక, ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న ఒక మహిళ స్నానానికి వెళ్లగా.. ఆజాద్ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. అనంతరం ఆ మహిళ తీవ్రమైన బాధతో మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వానికి ఆజాద్ పై ఫిర్యాదు చేసినా.. అగ్ర నాయకత్వం అతనిని కనీసం మందలించకుండా వదిలేశారని తెలిపారు.


తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో తీవ్ర మనస్తాపానికి గురై.. ఏమి చేయాలో అర్థం కాక ఆ మహిళ కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులు సమాచారం అందించారని పేర్కొన్నారు. బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకోబడిన అమాయకపు గిరిజన మహిళలపై ఆజాద్ లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడని, ఎన్నో సార్లు నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి ఆజాద్ పై ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మహిళల హక్కులను కాలరాస్తూ.. వారిపై వేధింపులకు పాల్పడుతున్న మావోయిస్టులు మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తుప్పు పట్టిన సిద్ధాంతాల పేరుతో మావోయిస్ట్ పార్టీ నాయకుల మనుగడ కోసం అమాయకపు గిరిజనులను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుని వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఎస్పీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed