సరుకు రవాణా‌లో దక్షిణ మధ్య రైల్వే‌ అరుదైన రికార్డు

by Nagaya |
సరుకు రవాణా‌లో దక్షిణ మధ్య రైల్వే‌ అరుదైన రికార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వే కొవిడ్‌-19 మహమ్మారితో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో గొప్ప మైలురాయిని అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు. జోన్‌ పరిధిలో 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి17వ తేదీ వరకు సరుకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల (ఎంటీల) లోడింగ్‌ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు.

అన్ని రకాల సరుకుల లోడింగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లో సరుకు రవాణాలో వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది, అధికారులు అహర్నిశలు కృషి చేస్తూ సరుకు రవాణా రైళ్ల రాకపోలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండడంతో సరుకు రవాణాలో గత ఆర్థిక సంవత్సరం 2020 నుంచి 2021 తో పోలిస్తే 17.7శాతం అధిక ఆదాయాన్ని, 17.3శాతం అధిక లోడింగ్‌ను సాధించిందన్నారు. సరుకు రవాణా లోడింగ్‌ పురోగతిలో బొగ్గు 53.78 ఎంటీలు, సిమెంట్‌ 32.339 ఎంటీలు, ఆహార ధాన్యాలు 7.980 ఎంటీలు, ఎరువులు 5.925 ఎంటీలు, కంటైనర్ల సేవలు 2.137 ఎంటీలు, స్టీల్‌ ప్లాంట్ల కోసం ముడి సరుకు 4.14 ఎంటీలు, అల్మూనియా పౌడర్‌, ఫ్లైయాష్‌, గ్రానైట్‌, చెక్కర మొదలైనవి 5.80 ఎంటీల లోడింగ్‌తో భాగస్వామ్యంగా ఉన్నాయని తెలిపారు.

సరుకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం, పలు స్టేషన్‌ల మార్గాలలో మౌలిక సదుపాయాల కల్పన తో సహా సరుకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోవడంతో సరుకు రవాణా ఆదాయం, లోడిరగ్‌ వృద్ధి సాధించడానికి తోడ్పడినాయని తెలిపారు. దీనికి అదనంగా, డివిజినల్‌, జోనల్‌ స్థాయిలలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజీనెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లు (బీడీయూ) జోనల్‌ సరుకు రవాణాలో అభివృద్ధికి దోహదపడిందని అన్నారు. జోన్‌ సరుకు రవాణ లోడింగ్‌లో, ఆదాయంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే కృషి ఇకమీదట కూడా కొనసాగించాలని అధికారులకు సూచించారు.

Next Story

Most Viewed