దేశ రాజధానిలో అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద మృతి.. తల్లి పరిస్థితి విషమం

by Malleboina Mahesh |

ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఇద్దరు సోదరీమణుల అనుమానాస్పద మృతి. అపస్మారక స్థితిలో ఉన్న తల్లికి ఎయిమ్స్‌లో చికిత్స. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దేశ రాజధానిలో అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద మృతి.. తల్లి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని అయిన ఢిల్లీలో అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద మృతి (Sisters die under suspicious circumstances) చెందడం సంచలనంగా మారింది. మాల్వియా నగర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా, ఇద్దరు సోదరీమణులు విగత జీవులుగా పడి ఉండగా, వారి తల్లి అపస్మారక స్థితిలో పడి ఉంది. బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్‌కు తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు లా (న్యాయశాస్త్రం) చదువుతున్నారని, మరొకరికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని ఆయన తెలిపారు. వారిలో ఒకరు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారని, పోలీసులు దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ హృదయ విదారక ఘటన మాల్వియా నగర్ నివాసితులను షాక్‌కు గురిచేసింది.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే మరణాలకు గల అసలు కారణాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story