మూడేళ్ల తర్వాత మళ్ళీ టాప్ 10 లోకి సింధు

by Muthe.Rajitha |

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు (PV Sindhu) మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటూ సరికొత్త మైలురాయిని అందుకున్నారు.

మూడేళ్ల తర్వాత మళ్ళీ టాప్ 10 లోకి సింధు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు (PV Sindhu) మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటూ సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో ఘన విజయంతో బోణీ కొట్టిన ఆమె, దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్-10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకువచ్చారు. ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బలమైన ప్రత్యర్థి బుసానన్ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫాన్‌తో సింధు తలపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 25-23, 21-16 తేడాతో వరుస సెట్లలో బుసానన్‌ను మట్టికరిపించి, టోర్నీలో ప్రీ-క్వార్టర్స్ కు అర్హత సాధించారు.

ఈ అద్భుత విజయంతో పాటు జూన్ 2న విడుదల చేసిన తాజా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) అధికారిక ర్యాంకింగ్స్ ప్రకారం, పీవీ సింధు 10వ స్థానానికి చేరుకున్నారు. 2023 సంవత్సరం తర్వాత ఆమె మళ్లీ టాప్-10 లీగ్‌లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. గాయాలు, ఫామ్ లేమితో కొంతకాలం ఇబ్బంది పడినప్పటికీ, పట్టుదలతో తిరిగి టాప్-10 లోకి దూసుకొచ్చిన సింధుకి అభిమానులు, క్రీడా ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story