రెబ్బెన పీహెచ్‌సీలో ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత.. రోగుల ఆందోళన

by Jakkula.Mamatha |

రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో యాంటీ రేబీస్(ఏఆర్వీ) ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెబ్బెన పీహెచ్‌సీలో ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత.. రోగుల ఆందోళన
X

దిశ,రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో యాంటీ రేబీస్(ఏఆర్వీ) ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం సుమారు 11:30 గంటలకు ‘దిశ’ ప్రతినిధి ఆసుపత్రిని సందర్శించగా, ఏఆర్వీ ఇంజెక్షన్ల నిల్వలు లేవని, చికిత్స కోసం ఆసిఫాబాద్, తాండూర్, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సంబంధిత సిబ్బంది సూచించినట్లు తెలిసింది.

రెబ్బెన మండలంలో కోతులు, కుక్కలు, పాములు, ఇతర విష జంతువుల కాట్లకు గురయ్యే ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఏఆర్వీ ఇంజెక్షన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందలేని పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అత్యవసర సేవ తప్పనిసరిగా ఉండాలని కోరుతున్నారు.

ఈ విషయమై ‘దిశ’ ప్రతినిధి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డా. సీతారాంను ఫోన్‌లో వివరణ కోరగా.. ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే అవసరమైన స్టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీహెచ్‌సీలో వెంటనే ఏఆర్వీ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story