T20 World Cup: టీమ్ ఇండియాకు భారీ షాక్.. గాయంతో ప్రపంచకప్‌కు యువ బౌలర్ దూరం!

by Malleboina Mahesh |

టీ20 ప్రపంచకప్ 2026లో అన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటి చాలా మంది ప్లేయర్లు గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకొగా.. మరికొంతమంది కొన్ని మ్యాచులకు దూరమయ్యారు.

T20 World Cup: టీమ్ ఇండియాకు భారీ షాక్.. గాయంతో ప్రపంచకప్‌కు యువ బౌలర్ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) 2026లో అన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటి చాలా మంది ప్లేయర్లు గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకొగా.. మరికొంతమంది కొన్ని మ్యాచులకు దూరమయ్యారు. రేపటి నుంచి టీ20 ప్రపంచ కప్ మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) మోకాలి గాయం (Knee injury) కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 4న నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన అన్-అఫీషియల్ వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఈ గాయానికి గురయ్యాడు. తన మొదటి ఓవర్‌లోనే రనప్ మధ్యలో రెండుసార్లు ఆగిపోయిన హర్షిత్, తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతూ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన ఆయన 16 పరుగులు ఇచ్చాడు.

వైద్య పరీక్షల అనంతరం హర్షిత్ రాణా గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతను పూర్తిగా కోలుకునేందుకు కనీసం 3 వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హర్షిత్ రాణా పూర్తిగా టీ20 ప్రపంచ కప్‌కు దూరమవ్వడం ఫిక్స్ అయింది. దీంతో భారత పేస్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే మరో కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండటంతో మేనేజ్‌మెంట్‌కు సవాళ్లు పెరిగాయి. ఫిబ్రవరి 7 నుంచి భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించాల్సి ఉండగా, ఈ లోపే హర్షిత్ స్థానంలో ఒక సమర్థవంతమైన రీప్లేస్‌మెంట్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి బీసీసీఐ (BCCI) నుండి హర్షిత్ గాయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞుడైన మొహమ్మద్ సిరాజ్, పొడవైన ప్రసిద్ధ్ కృష్ణ, ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్‌లలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కీలకమైన టోర్నీకి ముందు ఇలాంటి పరిణామాలు జట్టు కూర్పును దెబ్బతీస్తాయనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. త్వరలోనే బీసీసీఐ తన తుది నిర్ణయాన్ని ప్రకటించి, కొత్త ఆటగాడిని జట్టులోకి ఆహ్వానించనుంది.

Next Story