తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగిక దాడి.. చెప్పుతో కొట్టిన బాధితురాళ్లు

by Muthe.Rajitha |

తాము పనిచేసే బ్యూటీ పార్లర్ యజమాని తాగే నీటిలో మత్తుమందు కలిపి తమపై లైంగిక దాడి చేసాడని తెలుసుకున్న నలుగురు మహిళా ఉద్యోగులు అతనిపై చెప్పులతో దాడి చేశారు.

తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగిక దాడి.. చెప్పుతో కొట్టిన బాధితురాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని చురు జిల్లా రాజ్‌గఢ్ పరిధిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తాము పనిచేసే బ్యూటీ పార్లర్ యజమాని తమ తాగే నీటిలో అనుమానాస్పదంగా మత్తుమందు కలిపి తమపై లైంగిక దాడి చేసాడనే నిజాన్ని తెలుసుకున్న నలుగురు మహిళా ఉద్యోగులు అతనిపై చెప్పులతో దాడి చేశారు. సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

రహస్య కెమెరాతో దొరికిపోయిన యజమాని

భవానీ శంకర్ ఖత్రి అనే వ్యక్తి సదుల్‌పూర్‌లో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని ప్రవర్తనపై అక్కడ పనిచేసే నలుగురు మహిళా సిబ్బందికి తీవ్ర అనుమానం కలిగింది. తాము తాగే నీటిలో అతను ఏదో కలుపుతూ.. తాము స్పృహలో లేనపుడు తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని గమనించిన ఆ యువతులు.. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఒక ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా పార్లర్ లోపల ఎవరికీ తెలియకుండా ఒక మొబైల్ ఫోన్ కెమెరాను రహస్యంగా అమర్చారు. ఆ కెమెరాలో యజమాని భవానీ శంకర్ ఖత్రి మహిళా సిబ్బంది తాగే నీటి పాత్రలో ఒక అనుమానాస్పద మత్తుమందు బిళ్ళను కలుపుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

చెప్పు దెబ్బలతో దేహశుద్ధి

తమ అనుమానం నిజమేనని ఆధారాలతో సహా రుజువవ్వడంతో ఆ నలుగురు మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. యజమాని అని కూడా చూడకుండా భవానీ శంకర్‌ను గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు, యువతులు అతడిని చెప్పు దెబ్బలు కొట్టిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story