మళ్లీ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Web Desk |
మళ్లీ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికాలో 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలకు తోడు, దేశీయంగా కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, రూపాయి మారకం నీరసించడం, ముడి చమురు ధరల వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్‌బీఐ తాజాగా ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు మద్దతిచ్చేందుకు వరుసగా పదోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయినప్పటికీ ఇతర అంశాలు ఎక్కువ ప్రభావం చూపడంతో మదుపర్ల అమ్మకాలకు సిద్ధమయ్యారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773.11 పాయింట్లు పతనమై 58,152 వద్ద, నిఫ్టీ 231.10 పాయింట్లు కుదేలై 17,374 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఫైనాన్స్ రంగాలు అత్యధికంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఆల్ట్రా సిమెంట్, విప్రో, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ షేర్లు 2-3 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 75.37 వద్ద ఉంది.


Next Story