వరుసగా రెండో రోజూ నష్టాల్లో సూచీలు!

by Disha Web Desk 17 |
వరుసగా రెండో రోజూ నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను ఎదుర్కొన్నాయి. కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల కంటే ఎక్కువగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా గురువారం రోజు ట్రేడింగ్ ఒడిదుడుకుల మధ్యే కదలాడింది. దేశీయంగా కూడా అధిక ద్రవ్యోల్బణం, సరఫరా సవాళ్ల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారని విశ్లేషకులు తెలిపారు. ఉదయం నుంచి అధిక నష్టాలతో ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు చివరి గంటలో కొంతమేర కోలుకుని స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89.14 పాయింట్లు క్షీణించి 57,595 వద్ద, నిఫ్టీ 22.90 పాయింట్లు తగ్గి 17,222 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్ రంగాలు 1.5 శాతానికి పైగా నీరసించగా, ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా.రెడ్డీస్, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. కోటక్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.34 వద్ద ఉంది.


Next Story

Most Viewed