రహదారి మూసి వేయడం పై సర్పంచ్ ఆగ్రహం!

by Jakkula.Mamatha |

అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండా నుంచి అజ్మీర తండా, ఖానాపురం వెళ్లే ప్రధాన రహదారిని కొంతమంది కంపవేసి మూసివేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

రహదారి మూసి వేయడం పై సర్పంచ్ ఆగ్రహం!
X

దిశ, అనంతగిరి: అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండా నుంచి అజ్మీర తండా, ఖానాపురం వెళ్లే ప్రధాన రహదారిని కొంతమంది కంపవేసి మూసివేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మార్గం మూసివేయబడటంతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్య సేవలు, నిత్య అవసరాల రవాణా పూర్తిగా ప్రభావితమయ్యాయి. గత పది రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గ్రామాల మధ్య రాకపోకలకు కీలకమైన ఈ రహదారి మూసివేతతో ప్రజల దైనందిన జీవనం స్తంభించిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై అజ్మీర తండా సర్పంచ్ అజ్మీర శ్రీవిద్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని ఆమె విమర్శించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని పునరుద్ధరించాలని, లేకపోతే గ్రామస్థులతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

వినతి పత్రం ఇచ్చిన స్పందన కరువు: బొజ్జగూడెం గ్రామస్తుల ఆవేదన

రహదారి మూసివేశారని తక్షణమే రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చి వారం గడుస్తున్న నేటికీ చర్యలు తీసుకోవడం లేదని బొజ్జగూడెం తండా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. రహదారి మూసివేయడంతో మూడు గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని ఇదే విషయమై అధికారులకు చెప్పామని కానీ సమస్య తీవ్రత ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story