- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టీల్ బ్రిడ్జ్కు ఆమె పేరు పెట్టాలి : జంగం మధుకర్ రెడ్డి
స్వాతంత్ర్య సమరయోధురాలు, మాజీ పార్లమెంటేరియన్, ప్రముఖ సామాజిక సేవకురాలు సంగం లక్ష్మీబాయి 115 వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి.

దిశ, చంపాపేట్ : స్వాతంత్ర్య సమరయోధురాలు, మాజీ పార్లమెంటేరియన్, ప్రముఖ సామాజిక సేవకురాలు సంగం లక్ష్మీబాయి 115 వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం మధుకర్ రెడ్డి పాల్గొని సంగం లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ఆమె విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జంగం మధుకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, సామాజిక సేవలోనూ సంగం లక్ష్మీబాయి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ముఖ్యంగా విద్యను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే ఆమె సంకల్పం వల్ల నేటికీ వేలాది మంది పేద విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తూ తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారని పేర్కొన్నారు.
సమాజ అభ్యున్నతి, మహిళా సాధికారత, విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు, సేవలు భావితరాలకు ఆదర్శప్రాయమని కొనియాడారు. అలాంటి మహనీయురాలి సేవలకు తగిన గుర్తింపుగా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్నగర్ వరకు నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్కు “సంగం లక్ష్మీబాయి స్టీల్ బ్రిడ్జ్”గా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. సంగం లక్ష్మీబాయి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజ సేవే ఆమె జీవిత సందేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.






