బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

by Malleboina Mahesh |

బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం! నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీజేపీ నేతకు పట్టం. బీహార్‌లో కొత్త శకం.

బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు సాగిన 'నితీష్ కుమార్ శకం' అధికారికంగా ముగిసింది. దశాబ్ద కాలానికి పైగా రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని లోక్ భవన్‌లో నిర్వహించిన ఘనమైన వేడుకలో బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బీహార్‌లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి నాయకుడిగా సామ్రాట్ చౌదరి చరిత్ర సృష్టించారు.

సామ్రాట్ చౌదరి పట్టాభిషేకం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1968లో రాజకీయ కుటుంబంలో జన్మించిన సామ్రాట్ చౌదరి, గతంలో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బీహార్‌లోని ఓబీసీ సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా కోయిరీ, కుష్వాహ వర్గాల్లో ఆయనకు ఉన్న బలమైన పట్టును గుర్తించిన బీజేపీ అధిష్టానం, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.

సామ్రాట్ చౌదరి నియామకాన్ని ఎన్డీయే (NDA) కూటమి నేతలు స్వాగతించారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్వయంగా సామ్రాట్‌ను కలిసి అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో బీహార్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, నితీష్ కుమార్ రాజ్యసభ కు వెళ్లడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే వ్యూహాలకు మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడంతో బీహార్‌లో బీజేపీ తన సొంత బలాన్ని చాటుకోవడమే కాకుండా, రాష్ట్రాభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

Next Story