నేటితో ముగియనున్న RRB గ్రూప్-డి రిజిస్ట్రేషన్లు.. 22,195 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఇదే చివరి అవకాశం!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-02 06:10:28  IST  )

రైల్వేలో ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే ఆలస్యం చేయకండి! 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి గడువు. ఈరోజు అర్ధరాత్రి లోపు మీ అప్లికేషన్‌ను పూర్తి చేయండి.

నేటితో ముగియనున్న RRB గ్రూప్-డి రిజిస్ట్రేషన్లు.. 22,195 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఇదే చివరి అవకాశం!
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహిస్తున్న గ్రూప్-డి రిక్రూట్‌మెంట్ 2026 రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించారు. 22,195 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజు చివరి అవకాశం ఉంది. భారతీయ రైల్వే లోని వివిధ విభాగాల్లో మొత్తం 22,195 లెవెల్-1 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ భారీ నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేటి అర్ధరాత్రి లోపు అధికారిక పోర్టల్ rrbapply.gov.in ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. నేటి తర్వాత కొత్త రిజిస్ట్రేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించకోవాలని ఆర్ఆర్‌బీ కోరింది.

అర్హతలు- ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ట్రాక్ మెయింటెనర్, పాయింట్స్ మాన్, వివిధ విభాగాల్లో అసిస్టెంట్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి, అయితే నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల వారికి వయో సడలింపు లభిస్తుంది. విద్యార్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ (ITI) సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల ప్రకారం వివరాలను నమోదు చేయాలని అధికారులు సూచించారు.

ఫీజు వివరాలు- ఎంపిక ప్రక్రియ

జనరల్- OBC అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ చేయబడుతుంది. అలాగే SC, ST, మహిళలు, మైనారిటీ అభ్యర్థులకు రూ. 250 ఫీజు ఉండగా, వీరికి పరీక్ష తర్వాత పూర్తి మొత్తం రీఫండ్ అవుతుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించబడతాయి. తదుపరి అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలి.

Next Story