రాజీనామా చేయడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 12 |
రాజీనామా చేయడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, మునుగోడు: హుజురాబాద్ తరహాలో మునుగోడులో దళిత బంధు అమలు చేస్తానంటే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన పదవిని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్ లను మళ్లీ విధుల్లోకి తీసుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యేకు మండల కేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల , సిద్దిపేట నియోజకవర్గాల లాగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని కోరగా స్పందించి విధుల్లోకి తీసుకోనున్నట్లు కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తనకు డబ్బులు, పదవులు అవసరం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఈనాడు కేసీఆర్ సీఎం అయి ఉండేవారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం మునుగోడు నియోజకవర్గ ప్రజలు కూడా ముందుండి పోరాడారని, మునుగోడు పక్క రాష్ట్రంలో లేదని, తెలంగాణలోనే ఉందని కేసీఆర్ కు గుర్తు చేశారు.

అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి మునుగోడు అభివృద్ధికి సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తే తమ సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తాటికొండ సైదులు, సాగర్ల లింగస్వామి, భీమనపల్లి సైదులు, జక్కల శ్రీను, నకరకంటి యాదయ్య, ఎండి అన్వర్, ఫీల్డ్ అసిస్టెంట్లు సైదులు, చిరంజీవి, శ్యామల సత్యనారాయణ, లక్ష్మయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed