దిగివచ్చిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయంలో బహిరంగ క్షమాపణకు సిద్ధం

by Muthe.Rajitha |

కాంతారా వివాదంలో రణవీర్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం అయ్యారు.

దిగివచ్చిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయంలో బహిరంగ క్షమాపణకు సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) తన తాజా చిత్రం ‘ధురంధర్‌ 2’ సాధిస్తున్న భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నప్పటికీ.. 'కాంతార' సినిమాలోని పవిత్రమైన 'పంజుర్లి' దైవ హావభావాలను అనుకరించిన వివాదం ఆయనను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో.. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ రణ్‌వీర్ సింగ్ ఒక అడుగు వెనక్కి తగ్గి, బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమవ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతిలో అత్యంత పవిత్రంగా కొలిచే పంజుర్లి దైవానికి సంబంధించిన సన్నివేశాలను ఒక వేదికపై రణ్‌వీర్ ప్రదర్శించిన తీరు కించపరిచేలా ఉందంటూ న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా రణ్‌వీర్ ఇప్పటికే క్షమాపణలు కోరినప్పటికీ, అందులో సరైన నిజాయతీ లేదని ఫిర్యాదుదారుడు వాదించడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఇటీవల ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు, రణ్‌వీర్‌పై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూనే, తదుపరి విచారణకు ఆయన పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది.

కోర్టు సూచనల మేరకు రణ్‌వీర్ సింగ్ తన లీగల్ టీమ్ ద్వారా అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలకడమే కాకుండా, భక్తుల సెంటిమెంట్లను గౌరవించే ఉద్దేశంతో ఆయన కర్ణాటక హైకోర్టులో బేషరతు క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కేవలం న్యాయపరమైన ప్రక్రియతోనే సరిపెట్టకుండా, రణ్‌వీర్ స్వయంగా మైసూర్‌లోని పవిత్ర చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, అక్కడ కూడా తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడానికి సుముఖంగా ఉన్నట్లు ఆయన తరఫు కౌన్సిల్ కోర్టుకు వెల్లడించింది. త్వరలోనే రణ్‌వీర్ సింగ్ తన మైసూర్ పర్యటన ద్వారా ఈ వివాదానికి మంగళం పాడనున్నారని స్పష్టమవుతోంది.

Next Story