సీసీ కెమెరా ఫుటేజీలతో రూ.2లక్షల80 వేల సొత్తు రికవరీ..

by Disha Web |
సీసీ కెమెరా ఫుటేజీలతో రూ.2లక్షల80 వేల సొత్తు రికవరీ..
X

దిశ, లక్షెట్టిపేట: వాహనం చోరీ కేసులోని ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును లక్షేట్టిపేట పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకొని చేధించారు. లక్షెట్టిపేట ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 19న రాత్రి స్థానిక ఆంధ్ర బోర్ వద్ద జాతీయ రహదారి పక్కన హార్డ్ వేర్ షాప్ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఎండి. ఆరిఫ్‌కి చెందిన బొలెరో పికప్ వాహనాన్ని ఇద్దరు దొంగలు చోరీ చేశారు.

వాహనాన్ని దుకాణం ముందు రాత్రి నిలిపి ఉంచి దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్ళాడు. కాగా, అదే రాత్రి మంచిర్యాల వైపు నుంచి కారులో లక్షెట్టిపేట వైపునకు వస్తున్న నిజామాబాద్‌కు చెందిన హజరత్ అలీ ఖాన్, షేక్ సమద్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు హార్డ్వేర్ షాప్ ఎదుట నిలిపి ఉంచిన వాహనాన్ని పసిగట్టారు. దుకాణం మూసి ఉండడం, అర్ధరాత్రి వేళ ఆ సమయంలో అటువైపుగా ఎవరూ కనబడకపోవడంతో పాత తాళంచెవిలతో వాహనాన్ని స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లారు. బాధితుడు ఆరిఫ్ ఉదయం షాపు వద్దకు వచ్చి చూడగా తన వాహనం జాడ కనిపించలేదు. దీంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని చోరీ చేశారని గత నెల 21న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా రెండు బృందాలుగా ఏర్పడి వాహనం చోరీ కేసును చేధించారు. నిందితులు చోరీ చేసిన వాహనాన్ని లక్షెట్టిపేట నుంచి జగిత్యాల, నిజామాబాద్‌ల మీదుగా హైదరాబాద్‌కు తీసుకు వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాదులోని స్క్రాప్ బిజినెస్ చేసే ఎండి లతీఫ్ అనే వ్యక్తికి వాహనాన్ని అమ్మగా, దాన్ని విడి భాగాలు చేసి ఇతరులకు రూ.2లక్షల 80వేలకు విక్రయించాడు. వాహనాన్ని చోరీ చేసిన హజ్రత్ అలీ ఖాన్, షేక్ సమద్ ఖాన్ అనే ఇద్దరు నిందితులను ఈ నెల 14న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, లతీఫ్‌ను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు లక్షెట్టిపేటలోని ఊత్కూర్‌రు చౌరస్తాలో పట్టుకొని అరెస్ట్ చేశారు. అమ్మిన వాహన విడిభాగాల డబ్బులను అతడి వద్ద నుంచి రికవరీ చేశారు. వాహనాన్ని చోరీ చేసిన హజ్రత్ అలీ ఖాన్, షేక్ సమద్ ఖాన్ అనే నిందితులకు గతంలో ఉట్నూర్, గుడిహత్నూర్, నిజాంబాద్ పోలీస్ స్టేషన్లలో సైతం పోలీస్ కేసులు ఉన్నాయి. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన బోడకుంటి తిరుపతి, సుభాష్, అంజి బాబులను ఆయన అభినందించారు.






Next Story

Most Viewed