స్వయంగా వారే అలా చేస్తుంటే.. ప్రజాస్వామ్యం ఉన్నట్లా.. లేనట్లా..?

by Disha Web Desk 19 |
స్వయంగా వారే అలా చేస్తుంటే.. ప్రజాస్వామ్యం ఉన్నట్లా.. లేనట్లా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రజాస్వామ్యం అనే పదానికి అర్ధం లేని విధంగా పరిపాలన సాగుతుంది. అభివృద్ధి పనుల కేటాయింపులో, సంక్షేమ పథకాల అమలులో అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుతుందంటే అనాటి నుంచి వచ్చే అనావాయితీ అనుకోవచ్చు. కానీ అపద వస్తే అదుకునే పోలీసులే అవినీతి నాయకులకు కొమ్ముకాస్తుంటే ప్రజాస్వామ్యం ఉన్నట్లా...! లేనట్లా.. అని ఆలోచించే పరిస్థితి దాపురించింది. పూర్తిగా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నేతలకు దాసోహంగా మారిపోయింది. నగరానికి అందుబాటులో ఉంటే పట్టణాల్లోని కొంత మంది పోలీసులు నిబద్దతో పనిచేసినప్పటికి మరికొంత మంది ఒకే వైపు ఉండి తప్పును ఒప్పుగా మల్చే ప్రయత్నం చేస్తున్నారు. పలు పోలీసు స్టేషన్లోని ఎస్ఐ, సీఐలు లాడ్జీల్లో, హోటల్లో సివిల్ డ్రెస్లతో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు తప్పు, ఒప్పులను పరిగణలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అనుకూలంగా ఉన్న నేతల అనుచరులకే న్యాయం చేయాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఏ సమస్యలోచ్చిన పోలీసులను ఆశ్రయించాలంటే భయపడుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పోలీసుల వైఖరీ దారుణంగా ఉంది.

కొడంగల్ నియోజకవర్గంలోని బోంరాస్పేట్ మండలం మహింతిపూర్, మద్దిమడుగు కేంద్రంగా జోరుగా ఇసుక రవాణ సాగుతుందనే ప్రచారం సాగుతుంది. అక్రమంగా ఇసుక వ్యాపారం చేసే వాళ్లు పోలీసులతో కుమ్మక్కై వ్యాపారం మూడు పూవ్వులు.. ఆరు కాయలుగా నడుస్తుంది.

కొడంగల్ పట్టణానికి చెందిన పోలీసులు టీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలో ఓ మహిళాను కిరోసిన్ పోసి అంటించిన సంఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహారించి మహిళా కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసి అన్యాయం చేశారు. కొడంగల్ సీఐ గ్రామ ప్రజల అభిప్రాయాలను సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నేతల కనుసన్నలోనే రిపోర్టు తయారు చేసినట్లు ఆరోపణలున్నాయి.

కొడంగల్‌లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ సంస్థగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. కండువా కప్పుకోవడం తప్ప టీఆర్ఎస్ నేతలు, పోలీసులు సేమ్ టు సేమ్ అనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇదే నియోజకవర్గంలో భూఅక్రమాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. భూ క్రయ, విక్రయాల్లో జరిగే అన్యాయాలపై అమాయక రైతులు స్టేషన్లకు వస్తే న్యాయం చేయాల్సింది పోయి రియల్ వ్యాపారులకు, అధికార పార్టీ నేతల వైపు మాట్లాడి వసూల్ రాజాగా మారిపోతున్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నంలోనే నడుస్తుందని సమాచారం.

తాండూర్ నియోజకవర్గంలోని యలాల మండలం పరిధిలోని కాగ్నానది ఒడ్డు నుంచి ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తున్న పట్టించుకోని పోలీసులు.. అమాయక ప్రజలు తమ అవసరాల నిమ్మత్తం తీసుకొస్తే పట్టుకొని కేసు నమోదు చేస్తారు. అదే అక్రమంగా ఇసుక తీసుకొచ్చి వ్యాపారం చేసే వారిపై చర్యలుండవ్. ఎందుకంటే ఆ దందా వెనుక అధికార పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారని పోలీసులు అలాంటి వారిని వదిలేస్తారు.

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, హయత్నగర్, ఆదిబట్ల, మహేశ్వరం, మీర్పేట్, రాజేంద్రనగర్, షాద్నగర్, శంషాబాద్ పోలీస్ స్టేషన్ల్లో కొంత మంది పోలీసు అధికారులు రియల్ వ్యాపారులకు, పెట్టుబడిదారులకు తోత్తులుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. సివిల్ కేసుల్లో తలదూర్చడంతో కొంత మొత్తంలో నగదు సంపాదించోచ్చు అనే ఆలోచనతో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంత మంది పరోక్షంగా కిరికిరి భూములను తీసుకొని పెట్టుబడిదారులను ముందుంచి అన్ని తానై చూస్తున్నట్లు సమాచారం. గతంలో ఇబ్రహీంపట్నం వనస్థలిపురం ఏసీపీ పరిధిలో భూదందాల సెటిల్మెంట్ విషయంలో పలువురు అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికి ఆ దందా వైపే పోలీసు వ్యవస్థ చూస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

సాధారణ కేసుల్లో వసూళ్లు..

భార్య భర్తల గొడవగానీ, అన్నదమ్ముల గొడవలు గానీ, ఆత్మహత్యలాంటి కేసుల్లో నిజా నిజాలు తెలుసుకోకుండా వసూళ్లకు ఆలవాటు పడిన పోలీసులు అమాయక ప్రజలపై కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. విషయాన్ని పూర్తిస్ధాయిలో విచారణ చేయకుండా అధికార బలంతో పనిచేసే వ్యక్తులకుగానీ, అధికార పార్టీ నేతల మద్దతుండే వాళ్లకే న్యాయం జరిగేవిధంగా వ్యవహరించడం సర్వసాధరణంగా మారిపోయింది. గ్రామాల్లో చదువుకునే విద్యావంతులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో జరిగే అన్యాయాలపై సోషల్ మీడియాలో, అధికారులకు ఫిర్యాదులు చేయడంలో ముందుంటే వారిపై నిఘా పెట్టి హింసలకు గురిచేస్తున్నారు. అతను ప్రచారం చేసే అంశాలపై విచారణ చేయకుండా వ్యక్తిగత స్వలాభం కోసం అధికారుల, ప్రజాప్రతినిధుల మొప్పుకోసం మాత్రమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టమైతుంది.

Next Story

Most Viewed