తమిళ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

by Batti.Sumithra |

తమిళనాడు నుంచి తప్పిపోయి హైదరాబాద్‌కు చేరుకున్న ఓ బాలుడిని శామీర్‌పేట పోలీసులు గుర్తించి అతని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

తమిళ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
X

దిశ, మేడ్చల్: తమిళనాడు నుంచి తప్పిపోయి హైదరాబాద్‌కు చేరుకున్న ఓ బాలుడిని శామీర్‌పేట పోలీసులు గుర్తించి అతని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 26 అర్ధరాత్రి శామీర్‌పేట ఎస్‌ఐ జి.సోమిరెడ్డి రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా తూంకుంట రోటరీ-1 వద్ద ఓ బాలుడు ఒంటరిగా కనిపించాడు. అతనికి తమిళం తప్ప ఇతర భాషలు తెలియకపోవడంతో ట్రాన్స్‌లేటర్ సహాయంతో వివరాలు సేకరించారు. బాలుడి పేరు ఇంతియాజ్‌గా గుర్తించి, అతని వద్ద లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శామీర్‌పేట సీఐ నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు బాలుడిని తల్లిదండ్రులు వచ్చే వరకు శామీర్‌పేట హోంలో ఉంచారు. ఆదివారం తల్లిదండ్రులు రావడంతో వారి వివరాలను ధృవీకరించి బాలుడిని అప్పగించారు. రెండు రోజుల క్రితం తమిళనాడులో రైలు ఎక్కిన బాలుడు దారి తప్పి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు విచారణలో వెల్లడైంది. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన శామీర్‌పేట పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story