- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగినప్పటికీ.. మళ్లీ పరిస్థితులు మొదటికే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఓ నౌకపై దాడి చేసి కాల్పుల విరమణను ఉల్లంఘించిందనే కారణంతో అమెరికా భీకర దాడులు చేసింది. దీనికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా గట్టిగానే బదులు ఇచ్చింది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. అమెరికా ఇంకా తన దాడులను కొనసాగిస్తే యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోతాయి అని ఇరాన్ హెచ్చరించింది.
చమురు ట్యాంకర్పై దాడి చేసినందుకే..
ఖతార్ నుంచి బయలుదేరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నౌకాశ్రయానికి హోర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఓ అంతర్జాతీయ నౌకపై గత శనివారం తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఆ ఖరీదైన నౌక కొంత దెబ్బతిన్నప్పటికీ అది తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆ డ్రోన్లను అప్పుడే నాశనం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడితో ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ దాడికి ప్రతిగా దక్షిణ ఇరాన్లోని సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడులకు దిగింది. ఇందులో సిరిక్, బందర్-ఎ లెంగెహ్. కేశ్మ్ ఐలాండ్ లలోని ఇరాన్ స్థావరాలపై అమెరికా యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అలాగే కేశ్మ్ దీవులలో ఉన్న ఇరాన్ నిఘా వ్యవస్థలు, క్షిపణి. డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ సైట్లపై దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్కు లభించిందని, కానీ కికు నౌకపై దాడి చేసి ఆ దేశం దానిని వదులుకుందని అమెరికా సైన్యం తెలిపింది.
ఇరాన్ ఎదురుదాడులు..
అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఐఆర్జీసీ ఎదురుదాడులకు దిగింది. బెహ్రెయిన్, కువైట్లో ఉన్న అమెరికా స్థావారలపై దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నేవీకి చెందిన 5వ ఫ్లీట్ బేస్ను టార్గెట్ చేసుకొని క్షిపణి దాడి చేసింది. దీంతో ఆ దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి. ఓ క్షిపణి రాజధాని మనామాలోని ఒక నివాస భవనాన్ని తాకడంతో కొంత ధ్వంసం అయ్యింది. అలాగే కువైట్లోని అమెరికా మెయిన్ ఆర్మీ బేస్ అయిన అలీ అల్-సలేంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే కువైట్ ఎయిర్ డిఫెన్స్ వాటిని గాలిలోనే పేల్చేశాయి.
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ఇక తాము శాంతియుతంగా ఉండలేమని ఆసహనం వ్యక్తం చేశారు. తాము సైనిక పరంగా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాల్సి వస్తుందని అన్నారు. అదే జరిగితే ఇక ఇరాన్ ఉనికే ఉండదని, దాని ఆనవాళ్లు భూమిపై కనిపించవని సీరియస్గా హెచ్చరించారు.






