డెత్ సర్టిఫికెట్ ఫోర్జరీ ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు

by Ratna Kumari |

నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామపంచాయతీలో డెత్ సర్టిఫికెట్ జారీలో ఫోర్జరీ జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

డెత్ సర్టిఫికెట్ ఫోర్జరీ ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామపంచాయతీలో డెత్ సర్టిఫికెట్ జారీలో ఫోర్జరీ జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గైని భీమ్‌రావు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ఎస్‌ఐ శివకుమార్ గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. రికార్డుల పరిశీలన.. సిబ్బంది నుంచి వివరాల సేకరణ విచారణలో భాగంగా ఎస్‌ఐ శివకుమార్ సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. డెత్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ, నమోదైన వివరాలు, దాఖలైన పత్రాలు, సంతకాల ధ్రువీకరణ తదితర అంశాలపై ఆరా తీశారు. గ్రామపంచాయతీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి కూడా వివరాలు సేకరించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు: ఎస్‌ఐ

ఈ సందర్భంగా ఎస్‌ఐ శివకుమార్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు, ఈ ప్రక్రియలో భాగమైన వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం వాస్తవాలను నిర్ధారించి చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని, విచారణ నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేదా ఊహాగానాలకు తావులేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.

గ్రామంలో చర్చనీయాంశంగా ఘటన..

డెత్ సర్టిఫికెట్ ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన బంజపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు విషయం బయటపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story