- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రెస్ మీట్ వెనుక పాకిస్థాన్ హస్తం.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు
అస్సాం ఎన్నికల్లో పాక్ ప్రమేయం! కాంగ్రెస్ ప్రెస్ మీట్ వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న సీఎం హిమంత. ఫోర్జరీ పత్రాలపై భార్య తరపున ఎఫ్ఐఆర్ నమోదు.

దిశ, వెబ్ డెస్క్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, గౌరవ్ గొగోయ్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, గువాహటిలో వారు వెల్లడించిన అంశాలన్నీ ఒక పాకిస్తానీ సోషల్ మీడియా గ్రూప్ సరఫరా చేసినవేనని ఆయన ఆరోపించారు. గత 10 రోజులుగా పాకిస్థాన్ ఛానళ్లు అస్సాం ఎన్నికలపై ఏకంగా 11 టాక్ షోలు నిర్వహించాయని, ప్రతి షోలోనూ 'కాంగ్రెస్ గెలవాలి' అనే ముగింపు ఇస్తున్నారని హిమంత పేర్కొన్నారు. నిన్నటి కాంగ్రెస్ ప్రెస్ మీట్కు, ఈ పాకిస్థానీ గ్రూపులకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని, దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తాయని ఆయన తెలిపారు.
అలాగే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఫోర్జరీ పత్రాలను (Fabricated Documents) వాడుతున్నారని, ఇది ఐపిసి 420, 468 సెక్షన్ల కింద నేరమని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడితే కొత్త చట్టాల (BNS) ప్రకారం జీవిత ఖైదు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తన భార్య రినికి భుయాన్ శర్మపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యక్తిగత ఆరోపణలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆమె నిన్న పోలీసులకు ఫిర్యాదు (FIR) చేశారని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అస్సాం ఎన్నికల నేపథ్యంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి 'పాకిస్థాన్' కార్డును వాడుతోందని విమర్శిస్తున్నారు.






