రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు రెడీ

by Malleboina Mahesh |

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్! పెండింగ్ రిజిస్ట్రేషన్ల కోసం కొత్త పోర్టల్ ప్రారంభం. మార్చి 31లోగా లక్ష ఇళ్ల గృహప్రవేశాలు.

రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు రెడీ
X

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలఖరులోగా పెండింగ్ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ‘టీజీహెచ్‌బీఆర్’పోర్టల్ ప్రారంభించిన ఆయన.. బ్రోకర్లు, మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారులే సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే ఇంటి నిర్మాణ సామగ్రి ధరలపై కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాపాల‌న‌-ప్రగ‌తి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రక‌టించారు. టీజీహెచ్‌ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌, టీజీహెచ్ కార్పొరేష‌న్ 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా చేప‌ట్టిన‌ ప్రజాపాల‌న ప్రగ‌తి నివేదిక కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో హౌసింగ్ కార్పొరేష‌న్, హౌసింగ్ బోర్డ్ నిర్దేశించుకున్న లక్ష్యాల‌ను చేరుకునేలా అంకిత భావంతో ప‌నిచేయాల‌ని సూచించారు. హౌసింగ్ బోర్డ్ ప‌రిధిలో దాదాపు 5వేల మంది త‌మ ఆస్తుల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉన్నట్లు తెలిపారు. పూర్తి స‌మాచారం పోర్టల్‌లోనే ఉంటుంద‌ని, రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధ్రువీకరణ, లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చన్నారు.

లక్ష ఇళ్ల గృహప్రవేశాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివ‌రకు 3.60 ల‌క్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయ‌గా ఇందులో ల‌క్ష ఇళ్లకు ఈ నెల 31లోగా గృహ‌ప్రవేశాలు చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే అనుకూలమైన తేదీలను అధికారికంగా తెలియజేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న ఈ పథకం ఒక బెంచ్ మార్క్‌గా నిల‌వ‌బోతుందన్నారు. పూరిగుడిసెలున్న పేదలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ కమిటీల సూచనలతో మార్చి 31లోపు అన్ని గ్రౌండింగ్‌ అయ్యేలా యుద్ధప్రాతిప‌దిక‌న‌ చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ సామగ్రి ధరలపై నియంత్రణ కమిటీలు చురుకుగా పని చేయాలని సూచించారు. ఎస్‌హెచ్‌జీ మ‌హిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాల‌ని తెలిపారు. చిన్న చిన్న కారణాలతో బిల్లులు నిలిపివేయొద్దని, త‌క్షణ‌మే వాటిని క్లియ‌ర్ చేయాల‌ని లేని ప‌క్షంలో అధికారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవ‌డానికి వెన‌కాడ‌బోమ‌ని హెచ్చరించారు.

Next Story