- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మోజ్ లో ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
హార్మోజ్ జలసంధిలో సోమవారం రాత్రి భారీ క్షిపణి దాడి జరిగింది. UAE కి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం క్రూజ్ క్షిపణులతో విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, హార్మోజ్ జలసంధిలో సోమవారం రాత్రి భారీ క్షిపణి దాడి జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం క్రూజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఓమన్ ప్రాంతీయ జలాల్లోని సముద్ర రవాణా మార్గంలో ప్రయాణిస్తున్న 'మొంబాసా', 'అల్ బహియా' అనే వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని యూఏఈ రక్షణ శాఖ మంగళవారం అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. ఈ ఘోర క్షిపణి దాడి ప్రభావంతో 'మొంబాసా' ట్యాంకర్లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ నౌకా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, రెండు నౌకల్లోని మరో ఎనిమిది మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ జాతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని యూఏఈ విదేశాంగ శాఖ తెలిపింది.
క్షిపణులు తగలడంతో రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగినప్పటికీ, నౌకల్లోని రక్షణ వ్యవస్థల, సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ తీవ్రంగా ఖండించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి ఉద్దేశపూర్వక దాడులను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై భారత విదేశాంగ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరణించిన భారతీయ నావికుడి కుటుంబానికి యూఏఈ ప్రభుత్వం గాఢ సానుభూతిని ప్రకటించింది. హార్మోజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య సైనిక ఘర్షణలు ముదిరిన నేపథ్యంలో, ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నౌకాయాన భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.






