ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు.. కార్యదర్శుల బదిలీలే కారణమా?

by Disha Web |
ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు.. కార్యదర్శుల బదిలీలే కారణమా?
X

దిశ, చెన్నారావుపేట: పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురిచేస్తూ, అకారణంగా బదిలీలు చేస్తున్న ఓ ఎంపీడీవో సస్పెన్షన్ కు గురైన సంఘటన నర్సంపేట డివిజన్‌లో చెన్నారావుపేట మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నారావుపేట మండల ఎంపీడీవోగా లలిత విధులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా లలిత మండలంలోని పలువురు కార్యదర్శిలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

చిన్న, పెద్ద గ్రామపంచాయతీలు అన్న బేధం లేకుండా జూనియర్, సీనియర్ అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు నీళ్లొదిలి బదిలీలకు తెరలేపింది. డబ్బులు ఇస్తే ఒకలాగా, లేదంటే మరోలా కార్యదర్శులను ఇష్టారీతిగా బదిలీ చేస్తూ మండల వ్యాప్తంగా ఉన్న కార్యదర్శులలో అభద్రతను నెలకొల్పింది. ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచులు ఈ విషయమై కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జిల్లా స్థాయి అధికారులు సైతం విచారణ చేశారు. విచారణలో ఆ ఆరోపణలు నిజమని తేలడంతో ఎంపీడీవో పై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను జడ్పీ సీఈఓ కార్యాలయం నుండి జారీ అయినట్లు చెన్నారావుపేట సూపరింటెండెంట్ దయాకర్ తెలిపారు.



Next Story

Most Viewed