పోలీసు విధులకు ఆటంకం

by Ratna Kumari |   (  Updated:2026-07-17 16:13:04  IST  )

వాహన తనిఖీల సందర్భంగా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట్ ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

పోలీసు విధులకు ఆటంకం
X

దిశ, నాగిరెడ్డిపేట్ : వాహన తనిఖీల సందర్భంగా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట్ ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఎల్లారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ కోసం ఆపారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తనిఖీ చేసే క్రమంలో వారు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు.

అంతేకాకుండా, పోలీసు శాఖకు చెందిన ట్యాబ్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన వినయ్, సచిన్, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన కళ్యాణ్, డిచ్‌పల్లి మండలానికి చెందిన నితిన్‌లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story