అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంఛర్లను పరీక్షించిన నార్త్ కొరియా

by Muthe.Rajitha |

నార్త్ కొరియా అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంఛర్లను పరీక్షించడం పశ్చిమ దేశాల్లో సంచలనం రేపింది.

అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంఛర్లను పరీక్షించిన నార్త్ కొరియా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర కొరియా తన అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చుకుంటూ శనివారం చేసిన తాజా ప్రయోగం పశ్చిమ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. 600 ఎంఎం (600mm) క్యాలిబర్ కలిగిన 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను ఏకకాలంలో పరీక్షించడం ద్వారా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు 420 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను, ముఖ్యంగా దక్షిణ కొరియాలోని కీలక నగరాలను, సైనిక విమానాశ్రయాలను క్షణాల్లో బూడిద చేసే సామర్థ్యం ఈ రాకెట్లకు ఉందని ఆ దేశ అధికారిక మీడియా 'కేసీఎన్‌ఏ' స్పష్టం చేసింది. ఈ పరీక్ష కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, వ్యూహాత్మక అణు ఆయుధాలను (Tactical Nuclear Weapons) ప్రయోగించడంలో తమ సన్నద్ధతను చాటు కోవడమేనని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.

కిమ్ వారసురాలి సమక్షంలో ప్రయోగాలు

ఈ కీలకమైన ఆయుధ పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె, దేశ వారసురాలిగా భావిస్తున్న కిమ్ జుయేతో కలిసి స్వయంగా పర్యవేక్షించడం విశేషం. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్లు సుమారు 364 కిలోమీటర్ల దూరంలోని ఒక ద్వీప లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు సమాచారం. ఈ ప్రయోగాల ధాటికి జపాన్ ప్రధాని కార్యాలయం వెంటనే అత్యవసర చర్యలను ప్రారంభించింది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు జపాన్ తీర దళం హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఒకేసారి 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించి బల ప్రదర్శన చేయడం ద్వారా, తమ భూభాగంపై ఏ చిన్న దాడి జరిగినా భీకరమైన ప్రతిదాడి తప్పదని ఉత్తర కొరియా హెచ్చరికలు పంపింది. దక్షిణ కొరియా సైన్యం కూడా ఈ ప్రయోగాలను నిశితంగా గమనిస్తూ తమ రక్షణ వ్యవస్థలను సిద్ధం చేస్తోందిని సమాచారం.

Next Story