ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు : ఎమ్మెల్యే కోరం కనకయ్య

by Ratna Kumari |

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారమ్ అందేలా చర్యలు తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు.

ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు : ఎమ్మెల్యే కోరం కనకయ్య
X

దిశ, టేకులపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారమ్ అందేలా చర్యలు తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం టేకులపల్లి మండలంలోని తొమ్మిదో మైలు తండాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి కుటుంబానికి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిబద్ధత పాటిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షుడు, కమిటీ సభ్యుల ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, సర్పంచ్ బానోత్ పూర్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story