జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

by Malleboina Mahesh |

జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక; వరుసగా నాలుగోసారి పార్టీ పగ్గాలు. ఢిల్లీలో నేడు ధృవీకరణ పత్రం అందజేయనున్న ఎన్నికల అధికారి.

జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, వెబ్ డెస్క్: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణ (Withdrawal of nominations) గడువు ముగిసే సమయానికి నితీష్ కుమార్ తప్ప మరెవరూ బరిలో లేరు. దీంతో ఆయన ఎన్నిక ఖాయమైందని పార్టీ రిటర్నింగ్ అధికారి అనీల్ ప్రసాద్ హెగ్డే (Anil Prasad Hegde) అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు.

నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో పార్టీని నడిపించడం ఇది వరుసగా నాలుగోసారి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కేంద్ర మంత్రి లలన్ సింగ్, బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వంటి సీనియర్ నేతలు నితీష్ కుమార్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కేడర్ అంతా నితీష్ నాయకత్వాన్నే కోరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్ ఝా వెల్లడించారు. నితీష్ కుమార్ (Nitish Kumar) నాయకత్వంలో అటు పార్టీ బలోపేతం కావడమే కాకుండా, బీహార్ అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని పార్టీ నేత రామ్‌నాథ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, నితీష్ కుమార్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, తమ బంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన లేదని, అంతకు మించి ఏమీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నితీష్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటూ పార్టీ జాతీయ రాజకీయాలను పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

Next Story