దివాలా తీసిన రియల్ ఎస్టేట్ కంపెనీ!

by Disha Web Desk 17 |
దివాలా తీసిన రియల్ ఎస్టేట్ కంపెనీ!
X

న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ దిగ్గజ కంపెనీ సూపర్‌టెక్ దివాలా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) శుక్రవారం ప్రకటించింది. అప్పులు చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల దాదాపు 25,000 గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది. అయితే, సూపర్‌టెక్ కంపెనీ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుపై జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ)ని ఆశ్రయించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూపర్‌టెక్ కంపెనీ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను కూల్చి వేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల కంపెనీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో సూపర్‌టెక్ కంపెనీ తమ బకాయిలను చెల్లించడంలో విఫలమైందని యూనియన్ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లింది. అనంతరం ఈ నెల 17న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కోసం కంపెనీ ప్రతిపాదించినప్పటికీ బ్యాంకు నిరాకరించింది. ఈ క్రమంలో ఎగవేతదారుగా గుర్తించడానికి కంపెనీ తరపు న్యాయవాది అంగీకారం తెలిపారు. ఆరోజు ఎన్‌సీఎల్‌టీ తీర్పును రిజర్వ్‌లో ఉంచగా, శుక్రవారం తీర్పును వెల్లడించింది.

ప్రస్తుతం సూపర్‌టెక్ కంపెనీ పలు నగరాల్లో వివిధ ప్రాజెక్టులను చేపడుతోంది. ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 25 వేల మంది ఇళ్ల కొనుగోలుదారులు కంపెనీ వద్ద కొన్న తమ ఫ్లాట్‌ల కోసం వేచి చూస్తున్నారు. తాజా తీర్పుతో వీరందరిపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. కానీ, ఈ తీర్పు వల్ల కొనుగోలుదారులకు సమస్య ఉండదని, వారికి కేటాయించిన ఫ్లాట్‌లు అందజేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.


Next Story

Most Viewed