'త్వరలో ఐటీ కంపెనీల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం'!

by Web Desk |
త్వరలో ఐటీ కంపెనీల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఐటీ రంగాన్ని పీడిస్తున్న అట్రిషన్ రేటు (వలసల రేటు) సమస్య గరిష్ట స్థాయికి చేరుకుందని పరిశ్రమల సంఘం నాస్కామ్ అభిప్రాయపడింది. ఇటీవల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే అట్రిషన్ రేటు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయని నాస్కామ్ వైస్-చైర్మన్ కృష్ణన్ రామానుజం అన్నారు. 'ఇప్పటికే గరిష్ఠానికి చేరుకున్న అట్రిషన్ రేటు రానున్న రోజుల్లో మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం.

కరోనా మహమ్మారి కారణంగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఐటీ కంపెనీల్లో అవసరమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా డిజిటలైజేషన్ కోసం కూడా డిమాండ్ అధికంగా ఉందని, అయినప్పటికీ కంపెనీలు సగటున 20 శాతానికి పైగా అట్రిషన్ రేటు వెల్లడించాయని' కృష్ణన్ తెలిపారు. దీన్ని అధిగమించేందుకు కంపెనీలు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.

బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు ఇచ్చాయి. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రైనింగ్, ఇంకా పలు చర్యలను కంపెనీలు చేపట్టాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల కంపెనీల లాభాల్లో మార్జిన్ ప్రభావితమైంది. రానున్న రోజుల్లో అట్రిషన్ రేటు నెమ్మదిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నైపుణ్యం ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో చిన్న పట్టణాలు, నగరాలకు విస్తరణ చర్యలు కూడా తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువ మంది మహిళలు, ఫ్రెషర్లను తీసుకుంటున్నాయని కృష్ణన్ రామానుజం వెల్లడించారు.


Next Story

Most Viewed